ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత పరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని అభియోగంతో,,,రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు విధించిన ప్రభుత్వం

international |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 09:45 PM

ఉత్తరకొరియా. ఈ పేరు వింటేనే అందరిలో ఒకింత భయం పుట్టుకొస్తుంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తీసుకునే నిర్ణయాలు ఊహించడానికి కూడా అందని విధంగా దారుణంగా ఉంటాయి. ఆయనను వ్యతిరేకించేవారు లేకుండా.. ప్రశ్నించేవారిని, విమర్శించేవారిని ఎలా శిక్షిస్తారో అందరికీ తెలిసిందే. అయితే కిమ్ జోంగ్ ఉన్ తాజాగా తీసుకున్న నిర్ణయం వింటే ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే. ఎందుకంటే ఉత్తర కొరియాలోని ఓ రెండేళ్ల చిన్నారిని అరెస్టు చేసి జీవిత ఖైదు విధించారు. ఈ ఘటన ఉత్తర కొరియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఉత్తర కొరియాలో జరుగుతున్న ఆకృత్యాలపై అమెరికా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం బయటపడింది.


ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. తీసుకునే నిర్ణయాలు, విధించే శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న నేరాలకే అక్కడ ప్రాణాలు తీసే శిక్షలు విధిస్తారనే విషయం ప్రపంచ దేశాలకు తెలుసు. తాజాగా కిమ్‌ సర్కారు తీసుకున్న అరాచక నిర్ణయం ఒకటి బయటికి వచ్చింది. క్రైస్తవులపై ఉత్తరకొరియా ప్రభుత్వం చేస్తున్న ఆగడాల గురించి అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. క్రైస్తవులు తమ పవిత్ర గ్రంథంతో కన్పిస్తే అక్కడ కఠిన శిక్షలు విధిస్తున్నారని అందులో తెలిపింది. అందులో భాగంగానే ఓ రెండేళ్ల చిన్నారికి జీవితఖైదు విధించినట్లు ఆ నివేదిక వెల్లడించింది.


అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022 పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. ఉత్తరకొరియా ప్రభుత్వం అక్కడి ప్రజలపై పాల్పడుతున్న దారుణాలను అందులో వెల్లడించింది. ఇతర మతాల వారి పట్ల కిమ్‌ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తోందని తెలిపింది. ఇప్పటివరకు అక్కడ దాదాపు 70 వేల మంది క్రైస్తవులను జైలుకు పంపినట్లు నివేదిక పేర్కొంది. ఇందులో ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలపడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. మత గ్రంథాన్ని కలిగి ఉండటం, మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో 2009 లో ఆ చిన్నారి కుటుంబాన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత రెండేళ్ల చిన్నారి సహా కుటుంబ సభ్యులందరికీ జీవిత ఖైదు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ నివేదిక వెల్లడించింది.


మతపరమైన కార్యకలాపాలకు యత్నించినందుకు గానూ అనేక మంది క్రైస్తవులను అరెస్టు చేసి పొలిటికల్‌ జైలు శిబిరాలకు తరలించారని నివేదిక తెలిపింది. అయితే ఆ శిబిరాల్లో ఖైదీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని వెల్లడించింది. అక్కడ ఉన్న ఖైదీలను శారీరకంగా హింసించడం, జీవించే హక్కును తిరస్కరించడం, పారదర్శక విచారణ జరపకపోవడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి అకృత్యాలు ఆ శిబిరాల్లో జరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. 2021 డిసెంబరులో కొరియా ఫ్యూచర్‌ అనే సంస్థ కూడా కిమ్‌ ఆగడాలపై ఓ నివేదిక విడుదల చేసింది. ఉత్తర కొరియాలో మతస్వేచ్ఛను కోరుకునే వారు అత్యంత తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక తెలిపింది. అత్యాచారం, అవయవాల దోపిడీ, హత్యలు, గూఢచర్యానికి పంపించడం వంటి దారుణాలకు ఉత్తర కొరియా అధికారులు పాల్పడుతున్నారని పేర్కొంది. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa