ప్రఖ్యాతి గాంచిన భారత నిఘా విభాగం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్గా రవి సిన్హా పేరు ఖరారైంది. 1988 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి రవి సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియామకం చేసింది. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కేంద్ర మంత్రుల కమిటీ ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రా అధిపతిగా ఉన్న సమంత్ కుమార్ గోయల్ త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రవి సిన్హాను నియమించారు. ఇప్పటికే పలు మార్లు సమంత్ కుమార్ గోయల్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను ఈ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ - ‘రా’ నిర్వహిస్తూ ఉంటుంది.
ఛత్తీస్గఢ్ కేడర్కు చెందిన రవి సిన్హా.. గత ఏడు సంవత్సరాలుగా రీసెర్చ్ అండ్ అనాలసిస్ ఆపరేషనల్ విభాగంలో చీఫ్గా సేవలు అందిస్తున్నారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో రవి సిన్హా.. విద్యాభ్యాసం పూర్తి చేశారు. అయితే రవి సిన్హాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు చాలా వరకు రహస్యంగా ఉన్నాయి. దేశంలోనే అత్యంత కీలకమైన భద్రతా విభాగంలో పనిచేసే అధికారులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. అందుకే వాటిని అధికారులు బయటికి వెల్లడించరు. భారత ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రతిభావంతుడిగా రవి సిన్హాకు పేరుంది. ఆయన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్లోని వివిధ విభాగాల్లో సేవలు అందించారు. భారత్కు పొరుగున ఉన్న వివిధ దేశాల్లో జరిగే పరిణామాలపై రవి సిన్హాకు మంచి పట్టు ఉండటంతో ఆయనకు ఈ పదవి దక్కేందుకు అర్హత ఉంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్, ఈశాన్య భారత్, వామపక్ష తీవ్రవాదంపై రవి సిన్హా పని చేశారు. ఇప్పటి వరకు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్ పదవిలో ఉన్న సమంత్ కుమార్ గోయల్ త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. జూన్ 30 న సమంత్ కుమార్ గోయెల్ పదవీకాలం పూర్తికానుండగా.. ఆ తర్వాత రా చీఫ్ స్థానంలో రవి సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa