ప్రభుత్వం అప్పులు చేసి బటన్ నొక్కితే అభివృద్ధి జరగదని, రాజధాని అమరావతిని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తే 13 జిల్లాల అభివృద్ధి జరుగుతుందని రాజధానికి 33వేల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులు స్పష్టం చేశారు. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, రైతుకూలీలు, మహిళలు చేస్తున్న దీక్షలు, నిరసనలు మంగళవారం నాటికి 1281వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాలలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారితే రాజధాని మారదన్నారు. పార్లమెంట్ చేసిన విభజన చట్టంలో వన్ క్యాపిటల్ అని ఉందని ఏపీ రాజధానిగా అమరావతిని గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పుడు మూడుముక్కల ఆట ఆడతానంటే రాజ్యాంగం ఒప్పుకోదన్నారు. అమరావతి అభివృద్ధిని కొనసాగించినట్లైతే లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి అందేదన్నారు. సీఎం జగన్రెడ్డి మూడు రాజధానులంటూ అభివృద్ధి లేకుండా చేశాడన్నారు. అమరావతిలో అభివృద్ధి పనులు జరిగినంతకాలం రాష్ట్రం కళకళలాడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అభివృద్ధిని అడ్డుకొని మూడు ముక్కల ఆట పెట్టిందో అప్పటి నుండి వ్యవస్థ గాడి తప్పిందన్నారు. హైకోర్టు తీర్పును అమలచేసి అమరావతి అభివృద్ధిని కొనసాగించాలన్నారు. అప్పుడే ఐదు కోట్ల మంది ఏపీ ప్రజల భవిష్యత్ బంగారు బాట అవుతుందన్నారు. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుందన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa