టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ నినాదంతో తలపెట్టిన బస్సుయాత్రకు టీడీపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి, విజయవంతం చేయాలని పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. మండలంలోని ఆర్. మరువపల్లిలో గల స్వగృహంలో బస్సు యాత్రపై బీకే సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అన్ని రకాలుగా బాదుడు బాదేసి.. జీవనం దుర్భరంగా మార్చేశారన్నారు. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు సన్నద్ధమయ్యారన్నారు. రాయలసీమ జోనలోని ఐదు జిల్లాల నాయకులతో కలిసి ఈనెల 23న కదిరి నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభమవుతుందన్నారు. 24న పుట్టపర్తి, 25న పెనుకొండ, 26న మడకశిర నియోజకవర్గంలో ప్రవేశిస్తుందన్నారు. 25న శెట్టిపల్లి నుంచి పెనుకొండకు బస్సు యాత్ర మొదలవుతుందన్నారు. బాబయ్య దర్గా, శ్రీకృష్ణదేవరాయల సర్కిల్, తన నివాసం వద్ద సమావేశం ఉంటుందన్నారు. 3 గంటల నుంచి తిరిగి షీప్ఫారం, తురకలాపట్నం గ్రామం మీదుగా యాత్ర కొనసాగుతుందన్నారు. రొద్దం చావిడిలో బహిరంగ సభ ఉంటుందన్నారు. చిన్నమంతూరు, చెరుకూరు, రొప్పాల, కలిపి, కె.మరువపల్లి మీదుగా పరిగి మండలంలోకి ప్రవేశిస్తుందన్నారు. బస్సు యాత్రకు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి, విజయవంతం చేయాలన్నారు. అనంతరం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీకే పార్థసారథి కేక్ కట్ చేసి, నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, టీడీపీ పెనుకొండ నియోజకవర్గ అధ్యక్షుడు చిన్నప్పయ్య, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు హరీష్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa