సింహాచలం దేవస్థానం శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి వార్షిక గిరి ప్రదక్షిణ , ఆషాఢ పౌర్ణమి జూలై 2, 3 తేదీలలో జరుగునున్న దృష్ట్యా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గిరి ప్రదక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలంలో జులై 3వ తేది సోమవారం ఆషాడ పౌర్ణమి సందర్భంగా నాలుగో విడత చందన సమర్పణ జరుపబడునని అన్నారు. ఈ సందర్భంగా ముందు రోజున జూలై 2 వ తేదీన సింహాచల క్షేత్రంలో లక్షల సంఖ్యలో భక్తులు గిరిప్రదక్షిణ సేవా నిర్వహించబడునని పేర్కొన్నారు.
జులై 2 వ తేది ఆదివారం ఉదయం నుండి భక్తులందరూ సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్లు దూరం గిరి ప్రదక్షణ ప్రారంభించి అడవివరం జంక్షన్ మీదుగా సెంట్రల్ జైలు , విశాలాక్షి నగర్, జోడుగుల్ల పాలెం, ఎం వి పి కాలనీ డబుల్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం , మాధవధార , ప్రహ్లాదపురం గోశాల మీదుగా తిరిగి స్వామివారి కొండ దిగువ తొలి పావంచా చేరుకుంటారని అన్నారు.
పారిశుధ్యం, టాయిలెట్స్ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని నియమించి నిర్వహించాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్ల నిర్వహణ, భక్తుల రద్దీని నియంత్రించుటకు దేవాలయ ప్రాకారంలో గల ముఖ్యమైన ప్రదేశాలలో విధి నిర్వహణ కొరకు భక్తుల సేవలకు దేవాదాయ శాఖ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయంలో నిత్య దర్శనానికి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని ఈవో భ్రమరాంబకు తెలిపారు. తగిన సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఆషాడ పౌర్ణమి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదం ఏర్పాట్లు చేయబడునని అన్నారు.
అనంతరం పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ గిరిప్రదక్షిణకు పోలీసులతో పాటు ఎస్ డి ఆర్ ఎఫ్ , మెరైన్ పోలీసులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. పాత గోశాల, గోపాలపట్నం నుంచి వచ్చే వాహనాలకు పాత గోశాల తరువాత అనుమతి లేదని తెలిపారు. శొంట్యం నుంచి వచ్చే వాహనాలకు అడవివరం వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.
సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఇంచార్జి ఇ. ఓ భ్రమరాంబ మాట్లాడుతూ ఈ ఏడాది జరిగే వార్షిక ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ , జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్, సింహాచల దేవస్థానం ఈవో భ్రమరాంబ , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, దేవాదాయశాఖ సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa