తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న భక్తులకు గుడ్న్యూస్. కొండపై భక్తుల ఒక్కసారిగా రద్దీ తగ్గిపోయింది. వీకెండ్లో కూడా పెద్దగా రద్దీ కనిపించకపోవగా.. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండాల్సిన అవసరం రాలేదు. శ్రీవారి ఉచిత దర్శనం కోసం కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన పని లేకుండా పోయింది. ప్రస్తుతం నేరుగా వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. మంగళవారం స్వామివారిని 69,143 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,145మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4.38 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
తిరుమల వేసవి సెలువుల రద్దీ మెల్లిగా తగ్గుతోంది. విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో పాటూ వేసవి సెలవులు కావడంతో గతవారం వరకు రద్దీ కనిపించింది. వేసవి సెలవుల తర్వాత మళ్లీ స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అయ్యాయి. దీంతో ఇప్పుడు రద్దీ బాగా తగ్గింది. భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో.. కంపార్ట్మెంట్లలో వేచి చూడకుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఉదయం 7 తర్వాత వచ్చే భక్తులకు మాత్రం కాస్త సమయం పడుతుందంటున్నారు. టీటీడీ కూడా జులై మొదటి వారం వరకు ఈ రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తోంది.
టీటీడీ నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు గడువులోగా పూర్తి అయిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణంకోసం సేకరించిన భూమిలో ఉన్న రుయా ఆసుపత్రి క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్స వార్డును పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సివున్నందువల్ల ఈ వార్డును తాత్కాలికంగా మరో చోటికి తరలించాలని రుయా అధికారులకు సూచించారు. స్థలం గుర్తించి కొత్త భవనం నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈవో టీటీడీ అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఏడాది డిసెంబర్లో ఆసుపత్రిని ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేశామన్నారు ఈవో ధర్మారెడ్డి. అనుకున్న గడువు ప్రకారమే నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న చిన్న పిల్లల హృదయాలయం (గుండె చికిత్సల ఆసుపత్రి) ప్రపంచంలోని ఉత్తమ ఆసుపత్రుల సరసన చేరిందని ఈవో వివరించారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1450 గుండె ఆపరేషన్లు నిర్వహించి పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించినట్లు చెప్పారు.అలాగే జీవన్ దాన్ కింద నాలుగు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రిలో చిన్న పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు న్యూరో, న్యూరో సర్జరీ, పల్మనాలజి, యూరాలజి తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa