ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 07:58 PM

ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఓ వౌపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ తీవ్ర అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో వాయవ్యంగా పయనించి మధ్యప్రదేశ్‌ మీదుగా వెళ్లనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడనం రాష్ట్రానికి దూరంగా ఉండటంతో మంగళవారం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.


మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ/ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. సాయంత్రం వేళల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.


రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం (28-06-2023)న తిరుపతి, అన్నమయ్య జిల్లాలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, సత్యసాయి, నంద్యాల జిల్లాలోనూ ఓ మోస్తరు మంచి తేలికపాటి వర్షాలు పడునున్నట్లు తెలిపారు. అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి అంటున్నారు.


అలాగే ఏపీలో కొన్ని చోట్ల వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో మంగళవారం పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అంతేకాదు ఈ వర్షాలతో ఎండలు, వేసవి తాపం, వడగాడ్పుల నుంచి తెలుగు ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు పలు జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ ఉంటుండగా.. ఆ తర్వాత వాతావరణం మారిపోతోంది. చెదురుమదులు వర్షాలు పడుతున్నాయి.. వాతావరణం కూడా ఒక్కసారిగా చల్లబడుతోంది.


మరోవైపు తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. బుధవారం ఉత్తర , ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్‌‌లో కూడా వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు.  ఆదిలాబాద్‌ జిల్లా తంసీలో 49.7 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా పిప్పలధారిలో 47.5, సంగారెడ్డి జిల్లా మానూర్‌లో 30.8, అన్నాసాగర్‌లో 18.3, మెదక్‌ జిల్లా రేగొడేలో 28.8, అదే జిల్లా కొత్తపేట్‌లో 22.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa