సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏం జరిగిన నిమిషాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది. ఓ మహిళపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్గా మారింది. ‘ఏం తమాషాగా ఉందా? నేను ఇంటింటికీ వస్తున్నా.. మీ సమస్యలు చెప్పండి పరిష్కరిస్తా అంటున్నా. అవేమీ చెప్పకుండా నన్ను నిలదీస్తావా’ అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ మహిళపై తీవ్రంగా ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో స్పీకర తమ్మినేని సీతారాం మంగళవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు శెట్టి నర్సింగరావు కుటుంబ సభ్యులు ఉన్న ఇంటికి వెళ్లకుండా ముందుకు సాగారు. దీంతో నర్సింగరావు మరదలు శెట్టి పద్మ తమ సమస్యలు చెప్పుకోవాలని అప్పటికే ఇంటి ముందు నిల్చోగా.. స్పీకర్ వెళ్లిపోవడాన్ని గమనించారు. వెంటనే ముందుకెళ్లి తన అత్త పింఛను సమస్యను స్పీకర్కు తెలపగా, పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం తనను ఏ కారణం వల్ల 6 నెలల క్రితం అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించారని ప్రశ్నించారు.
దీంతో చిర్రెత్తిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ‘ఆ సంగతి నాకు తెలుసు. నీ ఇష్టమొచ్చిన దగ్గర చెప్పుకో పో..’ అంటూ మండిపడుతూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాంపై సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అన్ని సంక్షేమ పథకాలకూ లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒక్కో పథకానికి రూ. 3,000 లంచమివ్వాలన్నారు. ఓ అంగన్వాడీ టీచర్ను తప్పు చేయకుండా తీసేయడమేంటని ప్రశ్నించారు. అడిగితే, దిక్కున్నోడికి చెప్పుకోమంటారా? ఇది స్పీకర్ భాషేనా ఇది? ఇదేనా మీ సంస్కారం అని ప్రశ్నించారు. ఈ వీడియో సీఎం జగన్కు పెట్టండి అని అన్నారు. ఇంటింటికీ వచ్చిన స్పీకర్.. తమ ఇంటికి రాకుండా ఎందుకు వెళ్లిపోతున్నారని అడిగితే ఇంత కోపమా అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు సంగతి తేలుస్తామని పద్మ బదులిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa