ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్డీఏ సమావేశానికి రావాలని పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 16, 2023, 07:41 PM

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) సమావేశంలో పాల్గొనాల్సిందిగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఎన్డీఏ సమావేశానికి రావాలని ఇప్పటికే భాగస్వామ్య పక్షాల అగ్ర నాయకులకు ఆహ్వానాలు పంపిన బీజేపీ నాయకత్వం.. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీన ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి హాజరవుతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్లు తెలుస్తోంది.


వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పార్టీల భేటీ ఢిల్లీలో జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులకు మద్దతు కోరడం, రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల బల ప్రదర్శన లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 18వ తేదీన ఢిల్లీలో ఎన్డీయే భాగస్యామ్య పార్టీల సమావేశం జరగనుంది. ఢిల్లీ అశోక హోటల్‌లో జరగనున్న ఈ భేటీకి పాత కొత్త మిత్రుల్ని బీజేపీ పిలుస్తున్నట్లు తెలుస్తోంది.


ఇందులో భాగంగానే పంజాబ్ రాష్ట్రంలోని శిరోమణి ఆకాలీదళ్ పార్టీకి సైతం ఆహ్వానం అందినట్లు సమాచారం. ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కూడా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆహ్వానం అందితే మాత్రం చంద్రబాబునాయుడు కచ్చితంగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్డీయే మిత్రపక్షం జనసేన పార్టీకి ఇప్పటికే ఆహ్వానం అందింది.


జనసేన తరఫున అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఇద్దరు నేతలు ఈ నెల 17వ తేదీన సాయంత్రం ఢిల్లీకి చేరుకుని, 18వ తేదీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరుకానున్నారు. అంటే రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రకు బ్రేక్ పడనుంది.


మరోవైపు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకు చెందిన హిందూస్తాన్ అవామ్ మోర్చా ఇటీవలే నితీష్ కుమార్ నేతృత్వంలోని మహా ఘట్ బంధన్‌తో తెగదెంపులు చేసుకుని ఎన్డీఏలో చేరింది. మరోవైపు మహారాష్ట్రలో జరిగిన పరిణామాలతో ఎన్సీపీ వర్గం అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్డీయేలో చేరింది. కర్ణాటకలో జేడీఎస్- బీజేపీ బంధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయే పాత, కొత్త మిత్రులు ఎవరెవరు కలుస్తారు.. ఎవరెవరికి ఆహ్వానం అందింది అనే విషయం మరో రెండ్రోజుల్లో తేలనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa