ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెడ్‌సెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ. 20 వేల జరిమానా అని ప్రచారం.. అది వాస్తవం కాదు ఏపీ రవాణాశాఖ క్లారిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2023, 06:31 PM

‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ. 20,000 జరిమానా.. ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానున్న జరిమానా.’’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించినట్లుగా గత రెండు రోజులుగా వాట్సాప్‌ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ సమాచారం తెగ వైరల్‌ అవుతోంది. ఆగస్టు నెల నుంచి ఈ జరిమానా అమల్లోకి వస్తుందని పలు వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ కావడంతో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


దీంతో ఈ అంశంపై బుధవారం ఏపీ రవాణా శాఖ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా అసత్య ప్రచారమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. మోటార్‌ వెహికిల్‌ చట్టం ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే తొలిసారి రూ. 1,500 నుంచి రూ. 2 వేలు జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు.


ఇదే విధంగా పదేపదే పట్టుబడితే రూ. 10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ నిబంధన చాలా కాలంగా అమల్లోనే ఉందని కమిషనర్ చెప్పారు. ఈ అంశంలో జరిమానా పెంపు ఆలోచన లేదని కమిషనర్‌ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో చేసే అసత్య ప్రచారాలను వాహనదారులు ఎవరూ నమ్మొద్దని కమిషనర్‌ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa