ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ భరత్‌ను సీఎం చేస్తా,,,నోరుజారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2023, 06:35 PM

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు జారారు. ఎమ్మెల్సీ భరత్‌ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ముఖ్యమంత్రిని చేస్తాం అనేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పల్లెబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కుప్పం పర్యటన భాగంగా ఎమ్మెల్సీ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చిన విషయాన్ని చెప్పబోయారు. పొరపాటున మంత్రిని చేస్తారనబోయి.. ముఖ్యమంత్రిని చేస్తారని నోరు జారారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై ఫోకస్ పెట్టారు. ఈ నియోజకవర్గానికి భారీగా నిధులు కూడా విడుదల చేశారు.. అంతేకాదు కుప్పం వైఎస్సార్‌‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్న కేఆర్‌జే భరత్‌కు ఎమ్మెల్సీ పదవిని అప్పగించారు. అంతేకాదు కొద్దిరోజులుగా గడప, గడపకు మన ప్రభుత్వంతో పాటుగా పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈసారి ఎలాగైన కుప్పంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే భరత్‌ను కుప్పంలో గెలిపిస్తే మంత్రిని చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


మరోవైపు టీడీపీ కూడా కుప్పంలో దూకుడు పెంచింది. తూర్పురాయలసీమ పట్టుభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఓ సమన్వయ కమిటీని నియమించారు. ఈసారి లక్ష మెజార్టీ లక్ష్యంగా నేతలు పని చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. కుప్పంలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని శ్రీకాంత్ ఆరోపించారు.


కుప్పంలో దొంగ ఓట్లు ఉంటే తీసేయాలని.. తామూ సహకరిస్తామన్నారు. తిరుపతిలో దొంగ ఓట్ల బాగోతంలో అధికారులు సస్పెండయ్యారని.. అధికారులు ఓటర్లను అక్రమంగా తీసేస్తే కేసులు వేస్తామన్నారు. వాలంటీర్ల పేరుతో కార్యకర్తలు ఓటర్ వెరిఫికేషన్ కు వెళ్తున్నారని.. బీఎల్‌వోలతో పాటు వాలంటీర్లు వెళ్తే ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దొంగ ఓట్ల విషయమై మంత్రి పెద్దిరెడ్డి జవాబివ్వాలన్నారు.


అంతేకాదు కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి పై సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో ఎవరైనా క్రియేటివిటి చూపించి లక్షల రూపాయిల బహుమతులు గెలుచుకోవచ్చని ప్రకటించారు. కుప్పంలో టీడీపీ కోసం స్లోగన్స్, షార్ట్‌ ఫిల్మ్స్‌కు దరఖాస్తుల్ని స్వాగతించారు. బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్‌కు రూ.50వేలు ఇస్తామని తెలిపింది.. అలాగే మంచి స్లోగన్‌కు ఒక్కదానికి రూ.5 వేలు ఇస్తామని చెప్పారు. మొత్తం మీద కుప్పంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. రెండు ప్రధాన పార్టీలు దూకుడు మరింత పెంచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa