వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ల పరిపాలనపై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ 9 ప్రశ్నలను సంధించింది. తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పార్టీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ మంత్రులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆమెను విమర్శించే మంత్రులు ముందుగా ఆయా శాఖలకు ఏం పనులు చేశారో? ఎంత వరకు అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ సంధించిన 9 ప్రశ్నలివే..
1) బాలల అక్రమ రవాణా విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఈ వైఫల్యానికి మీ సమాధానం ఏంటి?
2) తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుకబడింది. వ్యవసాయం, ఆక్వా, ఉద్యానరంగం ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఎందుకు తలసరి ఆదాయం పెరగలేదు?
3) జలజీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు వినియోగించుకోలేదు? ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం ఇచ్చే ఆర్థిక సహయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకు ప్రజలకు మంచి నీటిని అందించలేకపోయారు?
4) కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయారు? ఇళ్ల స్థలాల్లో వచ్చే కమిషన్ కోసం 30 లక్షల ఇళ్ల స్థలాలను సేకరించారు. ఇళ్లు నిర్మిస్తే కమిషన్ కాదు కాబట్టి ఆ పని చేయలేదా?
5) రాష్ట్రంలో పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారు? పట్టణ, గ్రామీణ వైద్య, ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, జనరల్ ఆస్పత్రుల్లో ఎందుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు? వైద్య పరీక్షలు అందుబాటులో లేవు? మందులు ఎందుకు ఇవ్వడం లేదు? వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు?
6) ప్యానల్లో ఉన్న 80 శాతం కార్పొరేట్ ఆస్పత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయడం లేదు? వారికి బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు?
7) ఉన్నత విద్యను ఎందుకు నిర్ల్యక్షం చేశారు? పీజీ విద్యార్థులకు ఎందుకు ఉపకార వేతనాలు దూరం చేశారు. డిగ్రీలో తెలుగును రద్దు చేశారు. ఆంగ్లభాషకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
8) ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు? యూనివర్సిటీల్లో ఉపన్యాసకులు, కళాశాలల్లో లెక్చరర్లను, పాఠశాలల్లో టీచర్లను ఎందుకు భర్తీ చేయలేదు? ఖాళీగా ఉన్న 2.50 లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు?
9) రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను ఎందుకు పునర్నిర్మించలేదు? వైసీపీ మంత్రులు కారుయాత్ర చేస్తే రోడ్ల పరిస్థితి తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa