మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్టేకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి పేరు.. సుప్రీంకోర్టు కొలీజియం బదిలీకి సిఫార్సు చేసిన 23 మంది హైకోర్టు జడ్జిల జాబితాలో ఉంది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను గత నెల జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్ తిరస్కరించారు. తీర్పుపై స్టే విధించడానికి సహేతకమైన కారణం లేదని జస్టిస్ హేమంత్ వ్యాఖ్యానించారు. కాగా, హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించిన జాబితాను గత రాత్రి సుప్రీంకోర్టు తన అధికారి వెబ్సైట్లో ఉంచింది. ‘మెరుగైన న్యాయం కోసం’ బదిలీలను కొలీజియం సిఫార్సు చేసినట్టు పేర్కొంది.
ఇక, జస్టిస్ హేమంత్ ప్రచ్చక్..గతంలో 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ మాంత్రి మాయ కోద్నానీ లాయర్ల బృందంలో ఓ సభ్యుడు. గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన జస్టిస్ ప్రచ్చక్.. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ప్రభుత్వంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత 2015లో గుజరాత్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా నియమించగా.. 2019 వరకూ అదే పదవిలో ఉన్నారు. చివరకు 2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ప్రచ్చక్తో పాటు 2002 గోద్రా అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పారని ఆరోపిస్తూ తనపై నమోదుచేసి ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ తీస్తా సెతల్వాద్ చేసిన అభ్యర్థనపై విచారణకు నిరాకరించిన జస్టిస్ సమీర్ దవే, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ వేసిన పిటిషన్పై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ గీతా గోపిని కూడా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది.
ఇటీవల ఓ మైనర్ రేప్ బాధితురాలు గర్భవిచ్ఛిత్తి కోసం చేసిన అభ్యర్థనను విచారించిన జస్టిస్ సమీర్ దవే ‘మనుస్మృతి’ ప్రస్తావన తీసుకొచ్చి వివాదానికి తెరతీశారు. ‘మీ అమ్మను లేదా మీ నాయినమ్మను అడగండి.. బాలికలకు పద్నాలుగు-పదిహేనళ్లకే వివాహం చేసేవారు.. అమ్మాయిలు 17 ఏళ్లు నిండకముందే మొదటి బిడ్డకు జన్మనిచ్చేవారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే ముందుగా పరిపక్వం చెందుతారు....మీరు చదవకపోయినా ఒకసారి మనుస్మృతిని చదవాలి’ అని జస్టిస్ దవే వ్యాఖ్యానించారు. వీరితో పాటు పంజాబ్ హరియాణా హైకోర్టుకు చెందిన నలుగురు, అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఒకరు కొలీజియం బదిలీలకు సిఫార్సు చేసిన జాబితాలో ఉన్నారు. ఆగస్టు 3న జరిగిన సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 10న నిర్వహించిన సమావేశంలో మరో 14 మంది న్యాయమూర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa