ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మీదుగా మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్,,,,చెన్నై నుంచి విశాఖ వచ్చిన 16 బోగీల రైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 08:36 PM

ఏపీలో మరో వందేభారత్ రైలు పట్టాలెక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఆ దిశగా సంకేతాలు ఇస్తే.. ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు బయలుదేరింది. దీంతో విశాఖ-తిరుపతి మధ్య నడుపుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది పూర్తిగా క్లారిటీ రాలేదు. తిరుపతి నుంచి విశాఖకు నడిపిచే అవకాశం ఉందని మాత్రం చెబుతున్నారు.


అయితే వందేభారత్ రైలుపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని వాల్తేరు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ రైలు నడుస్తోంది. ఇప్పుడు ఈ రైలు అందుబాటులోకి వస్తే తిరుపతికి వెళ్లే భక్తులకు సైతం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. అయితే ఈ వందేభారత్‌ను విశాఖ నుంచి తిరుపతికి నడిపిస్తారా.. లేక చెన్నై నుంచి విశాఖకు వెళుతుందా అన్నది పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.


మరోవైపు విశాఖ భువనేశ్వర్ మధ్య వందేభారత్ రైలు పట్టాలెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌లో వందేభారత్‌కు హాల్ట్ ఇవ్వాలని కోరారు.


దీంతో త్వరలోనే విశాఖ భువనేశ్వర్ మధ్య రైలు పట్టాలెక్కబోతుందనే చర్చ జరుగుతోంది. విశాఖ-భువనేశ్వర్ మధ్య వందేభారత్ రైలు ప్రారంభమవుతుందని మే నెలలోనే వార్తలొచ్చాయి. ఆ నెలలోనే శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలు వచ్చి ఆగింది.. అప్పుడు ట్రయిల్ రన్ నిర్వహించారనే చర్చ జరిగింది. తాజాగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు రైల్వేశాఖ మంత్రిని కలవడం చర్చనీయాంశమైంది.


ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖకు.. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కాచిగూడ బెంగళూరు మధ్య కూడా మరో వందేభారత్ ప్రారంభంకాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రయిల్ రన్ కూడా పూర్తి చేశారు. ఈ మూడు కొత్త రైళ్లు కనుక ప్రారంభం అయితే మొత్తం ఐదు రైళ్లు ఏపీ మీదుగా వెళుతున్నట్లే. కేంద్రం దేశంలోని ప్రధాన నగరాలు, ముఖ్య పట్టణాలు, రాష్ట్ర రాజధానులకు మధ్య ఈ వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న రెండు రైళ్లలో సికింద్రాబాద్ నుంచి వందేభారత్ విశాఖ రైలు ఒకటి. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో వందేభారత్ రైలు నడుస్తుండగా.. మంగళవారం తప్ప మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa