ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోయలో పడ్డ చార్‌ధామ్ యాత్రికుల బస్సు.. ఏడుగురు మృతి.. 27 మందికి గాయాలు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 09:14 PM

ఉత్తరాఖండ్‌లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళ్తోన్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 27 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరకాశీ జిల్లాలోని గంగ్నానీ వద్ద చోటుచేసుకుంది. యాత్రికులు గంగోత్రి నుంచి తిరిగి వస్తుండగా.. గంగ్నానీ వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయానికి బస్సులో 35 మంది యాత్రికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరంతా గుజరాత్‌కు చెందినవారని, చార్‌ధామ్ యాత్రకు వచ్చారని పేర్కొన్నారు.


ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ ప్రమాదంపై స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. వీలైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టి, బాధితులను రక్షించాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, వైద్య సిబ్బంది ఘటనా స్థలిలో ఉన్నారని చెప్పారు. వైద్య సహాయం అవసరమైతే డెహ్రాడూన్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేయడానికి హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచినట్టు సీఎం పుష్కర్ సింగ్ వెల్లడించారు.


స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. చనిపోయినవారంతా గుజరాత్‌కు చెందిన యాత్రికులేనని తెలిపారు. గత నెల రోజులుగా ఉత్తరాఖండ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు మెరుపు వరదలు సంభవించి, ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోగా.. ఈ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa