కుమార్తె చనిపోయిందని శోకంలో మునిగిపోయిన కుటుంబం.. అమె అంత్యక్రియలు కూడా పూర్తిచేసింది. అయితే, ఇంతలోనే నాన్నా నేను బతికే ఉన్నానంటూ ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో ఇది భ్రమా? నిజమా? అనుకున్నారు. చివరకు ఫోన్ చేసిన యువతి తమ కుమార్తే అని నిర్దారించుకున్నారు. కుమార్తెకు బదులు మరొక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్టు గుర్తించారు. ఈ ఘటన బిహార్లోని పూర్ణియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పూర్ణియా జిల్లా అక్బర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే అన్షు కుమారి నెల రోజుల కిందట కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు ముమ్మరంగా గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు.
దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఈ క్రమంలో గతవారం ఓ కాల్వ సమీపంలో యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా.. ఒంటిపై ఉన్న దుస్తులు, గుర్తులు ఆధారంగా తమ కుమార్తె శవమేనంటూ అన్షు కుటుంబసభ్యులు చెప్పడంతో వారికి అప్పగించారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన అన్షు తండ్రి.. కుమార్తె అంత్యక్రియలకు దూరమయ్యాడు. చివరకు ఆమె తాత కర్మకాండలను నిర్వహించాడు. అంత్యక్రియలు పూర్తిచేసిన తర్వాత అన్షు తన తండ్రికి ఫోన్ చేయడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు. తాను చనిపోయినట్టు భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలుసుకున్న యువతి.. తన తండ్రి బినోద్ మండల్ మొబైల్ ఫోన్కు శనివారం వీడియో కాల్ చేసి తాను బతికే ఉన్నానని తెలియజేసింది. చనిపోయిందని భావించిన తమ బిడ్డ ప్రాణాలతో ఉందని తెలియగానే ఆ కుటుంబంలో ఆనందంలో మునిగిపోయింది.
ధైర్యాన్ని కూడగట్టుకుని తాను ప్రేమించిన యువకుడ్ని పెళ్లి చేసుకోడానికి ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పింది. ప్రస్తుతం అదే జిల్లాలోని బన్మంఖి బ్లాక్లోని జాంకీనగర్ ప్రాంతంలోని తన భర్త ఇంట్లో ఉంటున్నట్టు తెలిపింది. దీనిపై అక్బర్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సూర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘యువతి బతికే ఉందని తెలిసిన తర్వాత వాస్తవాన్ని తెలుసుకోవాలని నేను అన్షు మొబైల్ ఫోన్కి వీడియో కాల్ చేశాను.. ఆమె అత్తమామలతో కలిసి బాగానే ఉన్నానని చెప్పింది.. ప్రియుడితో కలిసి ఇంటిలో నుంచి వెళ్లిపోయినట్టు వెల్లడించింది’ అని ఆయన అన్నారు. ఇక, అన్షు కుటుంబం అంత్యక్రియలు నిర్వహించిన యువతి మృతదేహం ఎవరిదనేది కూడా గుర్తించారు. ఇది పరువు హత్యని, తల్లిదండ్రులు ఆమెను చంపేశారని తెలిపారు. కుమార్తెను చంపిన తల్లిదండ్రుల కోసం వారి ఇంటికి వెళ్లగా.. అప్పటికే పరారయ్యారని ఎస్హెచ్ఓ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa