ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఎమ్మెల్యే అక్రమాలకు మంత్రి వత్తాసు.. వైసీపీ నేత సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 07:21 PM

ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తమ కుటుంబ సభ్యుల పేరిట కబ్జా చేస్తున్నారన్నారు వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. ఈ అక్రమాలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ వత్తాసు పలుకుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. అందుకే వీటిపై ఆయన నోరు మెదపటం లేదని.. తాను ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నా స్పందించడం లేదన్నారు. అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోకపోతే తాను కలెక్టరేట్‌ వద్ద ఆమరణ దీక్ష చేపడతానని తెలిపారు.


ఈ అక్రమాలకు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని.. ఆయన్ను ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని సూర్యప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మార్కాపురం మండలం రాయవరంలో మెడికల్ కాలేజీ ఎదురుగా సర్వే నం: 139/2ఏలో ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి మూడెకరాల భూమిని ఆక్రమించినట్టు విమర్శించారు. దీనికి సంబంధించి పత్రాలున్నాయన్నారు. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.15 కోట్లకు పైగా ఉంటుందన్నారు. తన కుటుంబ సభ్యుల పేరిట ఒక సెంటు భూమి ఉన్నా అరెస్టు చేయిస్తానని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి గతంలో చెప్పారని.. ఈ ఆధారాలతో తన తమ్ముడిపై కేసు పెట్టించి అరెస్టు చేయిస్తారా అని ప్రశ్నించారు.


తర్లుపాడు మండలంలో ఎమ్మెల్యే బంధువులు, ఎంపీపీ కుటుంబీకులు 300 ఎకరాలకు పైగా భూములను అక్రమంగా తమపరం చేసుకున్నారని ఆరోపించారు. రాయవరం మెడికల్‌ కళాశాల ఎదుట ఒక దినసరి కూలి పేరిట 4.98 ఎకరాలకు కంచె ఆక్రమించారన్నారు. మార్కాపురం ప్రాంతంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి కుటుంబసభ్యులే బినామీ పేర్లతో వేలాది ఎకరాల భూములను అక్రమించారని విమర్శించారు. ముఖ్యంగా పశ్చిమప్రాంతంలో భూఆక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. వెంటనే అడ్డుకట్ట వేయాలని మంత్రి సురేష్‌ను కోరారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డికి మంత్రి అండగా నిలబడటం తగదన్నారు. వందల కోట్ల విలువ చేసే భూములను ఆక్రమిస్తున్నా పట్టించుకోలేదన్నారు.


ఈ భూఅక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. మార్కాపురం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో, దొంగ రిజిస్ట్రేషన్లతో ఆక్రమించారన్నారు. మార్కాపురంలో జరుగుతున్న భూఆక్రమణలపై సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరానని తెలిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేంత వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. సూర్యప్రకాష్‌రెడ్డి గతంలో కూడా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఇప్పుడు మరోసారి మార్కాపురం ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. దీంతో స్థానికంగా వైఎస్సార్‌సీపీ రాజకీయాలు వేడెక్కాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa