ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే: దేశంలో తొలి 8 లేన్ల హైవే

national |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 09:53 PM

దేశంలోనే మొట్టమొదటి 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే ఇది. ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే వీడియోను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ షేర్ చేస్తూ.. ఇదొక ఇంజినీరింగ్ అద్భుతం అని పేర్కొన్నారు. ఈ రహదారిపై ప్రయాణ అనుభూతిని ప్రజలు మరో వందేళ్ల పాటు గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. ఢిల్లీ - గురుగ్రామ్ మధ్య ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని నిర్మించారు. ఢిల్లీలోని ద్వారక నుంచి గురుగ్రామ్‌లోని ఖేరీ దౌలా టోల్ ప్లాజా వరకు 27.6 కిలోమీటర్ల పొడవున ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించారు. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఈ రహదారిని మరో 3 నెలల్లో ప్రారంభించనున్నారు.


ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే ప్రత్యేకతలు:


✦ ఈ ఎక్స్‌ప్రెస్ వేను నార్తర్న్ పెరిపెరల్ రోడ్ లేదా ‘NH 248-BB’ అని కూడా పేర్కొంటున్నారు.


✦ ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే.. ఢిల్లీలోని ద్వారక నుంచి పంజాబ్‌లోని మానేసర్‌కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు.


✦ మానేసర్ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.


✦ మానేసర్ నుంచి సింఘు బోర్డర్‌‌కు కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు.


✦ ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేతో ఢిల్లీ, హర్యాణా రాష్ట్రాల వారికి లబ్ధి చేకూరనుంది.


✦ ఈ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా రోజూ 55,500 ప్యాసింజర్‌ వాహనాలు ప్రయాణిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.


✦ ఈ ఎక్స్‌ప్రెస్ నిర్మాణంలో 2 లక్షల టన్నుల స్టీలును ఉపయోగించారు. ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను నిర్మించడానికి వాడిన స్టీలు కంటే 30 రెట్లు ఎక్కువ స్టీల్‌ను వినియోగించారు.


✦ దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా నిర్మాణానికి ఉపయోగించిన దానికంటే 6 రెట్లు ఎక్కువ సిమెంట్ - కాంక్రీటుని ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ఉపయోగించారు.


ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే.. ఇంజినీరింగ్ అద్భుతం


✦ ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ సమయంలో తొలగించిన 1,200 చెట్లను తిరిగి మరో చోట నాటారు.


✦ ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని శివ మూర్తి వద్ద NH 48 (పాత NH 8) రహదారి 20వ కి.మీ. మార్క్ వద్ద ప్రారంభం అవుతుంది. ఢిల్లీ సెక్టార్‌ 21లోని ఖేర్కి దౌలా టోల్‌ ప్లాజా వద్ద ముగుస్తుంది.


✦ ఇది 8 లైన్ల ఎక్స్‌ప్రెస్‌ వే. ఇందులో 3.6 కి.మీ పొడవున ఎనిమిది లైన్ల అండర్‌ టన్నెల్‌ రోడ్డును నిర్మించారు.


✦ ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 3.6 కి.మీ. పొడవు గల ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌ ఉంది. అండర్‌పాస్‌ల యాక్సెస్‌ కోసం వేర్వేరు ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేశారు.


✦ ఈ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ఒక్కసారి ప్రయాణిస్తే.. ఆ ప్రయాణ అనుభూతిని మీరు 100 ఏళ్ల వరకూ గుర్తుపెట్టుకుంటారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు.


✦ ఈ ప్రాజెక్టు కిలోమీటర్‌ రహదారికి రూ. 18.20 కోట్ల వ్యయానికి ఆమోదం తెలుపగా.. వాస్తవంగా నిర్మాణానికి కిలోమీటరుకు రూ.250.77 కోట్లు ఖర్చయినట్లు కాగ్‌ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa