కోవిడ్ సోకడానికి ముందే కనీసం ఒక్క డోస్ టీకా తీసుకున్నా... ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన తర్వాత మరణం ముప్పు చాలా తక్కువగా ఉన్నట్టు ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇటువంటి వ్యక్తుల్లో పోస్ట్-డిశ్చార్జ్ మరణాల నుంచి 60 శాతం రక్షణ లభిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) పేర్కొంది. అధ్యయనంలో భాగంగా కరోనాతో ఆసుపత్రిలో చేరి డిశ్ఛార్జి అయిన 14,419 మందిని ఏడాది పాటు పరిశీలించింది. నాలుగు వారాలకు ఒకసారి వీరి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ ఏడాది తర్వాత పూర్తి వివరాలతో కూడిన నివేదికను రూపొందించింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వీరిలో 942 మంది (6.5శాతం) చనిపోగా.. మిగతా 13,477 మంది (93.5శాతం) క్షేమంగా ఉన్నట్టు తెలిపింది.
అయితే, పలు అనారోగ్య సమస్యలుండే 40 ఏళ్లు దాటిన వ్యక్తులు మధ్యస్థ నుంచి తీవ్ర స్థాయిలో వైరస్ బారినపడి కోలుకుంటే వారిలో ఏడాదిలోగా మరణ ముప్పు కాస్త ఎక్కువగానే ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను ఐసీఎంఆర్ రూపొందించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన కోవిడ్-19 రోగుల వివరాలను ఐసీఎంఆర్ పరిధిలోని నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ సేకరిస్తుంది. దేశవ్యాప్తంగా ఇలాంటివి 31 కేంద్రాలు ఉండగా.. అవి సేకరించిన డేటా ఆధారంగానే ఈ అధ్యయనం కొనసాగింది.
‘18 నుంచి 45 ఏళ్లలోపు వయసున్నవారిలో పోస్ట్ డిశ్చార్జ్ మరణాలకు కారకాలను అవగాహన చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాం.. ముందే కోవిడ్-19 టీకా తీసుకున్న ఈ వయస్సు వారిలో పోస్ట్ డిశ్చార్జ్ మరణాల నుంచి కొంత రక్షణ లభించింది.. అయినప్పటికీ గణాంకపరంగా దీనికి ప్రాముఖ్యత లేకపోవడంతో అప్పుడే ఓ నిర్ణయానికి రాలేం’ అధ్యయనం వ్యాఖ్యానించింది. అలాగే, 18-45 ఏళ్లలోపు వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలపై కూడా ఐసీఎంఆర్ దృష్టి సారించింది. ఆకస్మిక మరణాలకు, గుండెపోటుకు ఏదైనా సంబంధం ఉందా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa