విమానం గాల్లో ఉండగాగే ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. విషాదకర ఈ ఘటన ముంబయి-రాంచీ ఇండిగో విమానంలో సోమవారం చోటుచేసుకుంది. ముంబయి విమానాశ్రయం నుంచి సోమవారం సాయంత్రం ఇండిగో విమానం రాంచీకి బయలుదేరింది. ఈ విమానం గాల్లో ఉండగా.. ఓ 62 ఏళ్ల వృద్ధుడు అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం బాధితుడికి రక్తపు వాంతులు కావడంతో విమానాన్ని నాగ్పూర్ విమాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పరిస్థితి విషమిస్తుండటంతో నాగ్పూర్లోని కిమ్స్ హాస్పిటల్కు హుటాహుటిన తరలించారు.
అతడ్ని పరీక్షించిన అక్కడి వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటన విడుదల చేసింది. ‘ముంబయి-రాంచీ విమానం 6E 5093ను మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా నాగ్పూర్కి మళ్లించాల్సి వచ్చింది.. అస్వస్థతకు గురైన ప్రయాణికుడ్ని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాం.. కానీ, దురదృష్టవశాత్తూ అతడు ప్రాణాలను కాపాడలేకపోయాం’ అని తెలిపింది.
కిమ్స్ ఆస్పత్రి డీజీఎం అజాజ్ షమీ మాట్లాడుతూ.. ‘ముంబయి నుంచి రాంచీకి వెళ్తోన్న ఇండిగో విమానం ఎక్కిన 62 ఏళ్ల ప్రయాణీకుడు సీకేడీ, క్షయవ్యాధితో బాధపడుతున్నాడు.. విమానం గాల్లో ఉండగా రక్త వాంతులు చేసుకున్నాడు.. మార్గమధ్యలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని నాగ్పూర్కు మళ్లించారు’ అని కిమ్స్ హాస్పిటల్ బ్రాండింగ్, కమ్యూనికేషన్స్ డీజీఎం షమీ తెలిపారు.
‘బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.. తదుపరి ప్రక్రియ కోసం మృతదేహాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు’ అని షమీ పేర్కొన్నారు. కాగా, గత బుధవారం ఢిల్లీ-దోహా ఖతార్ ఎయిర్లైన్స్ విమానంలో పైలట్ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మర్నాడు నాగ్పూర్-పుణే ఇండిగో విమానం కెప్టెన్ నాగ్పూర్ విమానాశ్రయం బోర్డు గేట్ వద్ద స్పృహతప్పి పడిపోగా.. ఆస్పత్రికి తరలించేటప్పటికి చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa