ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయంత్రం వరకు ఎండలు,,,,ఆ తర్వాత వానలు మొదలు,,,ఏపీలో విభిన్న వాతావరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2023, 06:41 PM

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడ్డాయి.


పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 89.6 మిల్లీ మీటర్లు, జియ్యమ్మవలసలో 69.2, అనకాపల్లి జిల్లా చోడవరంలో 48.6, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 45, విజయనగరం జిల్లా డెంకాడలో 43.4, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 43.2, విజయనగరం జిల్లా తెర్లాంలో 42.4, విజయనగరంలో 39.8, పార్వతీపురం మన్యం జిల్లా గారుబిల్లిలో 27.4, కురుపాంలో 27.2, విజయనగరం జిల్లా మెరముడియంలో 26.2, ఏలూరు జిల్లా పోలవరంలో 24.6, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 23.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


ప్రకాశం జిల్లాలో మంగళవారం విభిన్నమైన వాతావరణం కనిపించింది. జిల్లా అంతటా మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రానికి కాస్త వాతావరణం చల్లబడటంతో పాటు ఒక మోస్తరు జల్లులు పడ్డాయి. ఉదయం పది గంటల నుంచే ఎండల తీవ్రత కనిపించింది. మధ్యాహ్నం 38 నుంచి 39.90 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో పెదఅలవలపాడులో 39.71 డిగ్రీలు, పచ్చవలో 39.50, వెలిగండ్లలో 39.08డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండతో పాటు ఉక్కపోత దెబ్బకు జనాలు అల్లాడిపోయారు. సాయంత్రం ఉన్నట్టుండి కొన్నిచోట్ల వాతావరణం చల్లబడింది అన్నారు. మబ్బులతో వానలు పడ్డాయి.. అక్కడక్కడా మోస్తరు వర్షం పడింది.


పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేటలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లు, కూడళ్లలో వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం వరకు ఎండ వేడి, ఉక్కపోత ఉండగా సాయంత్రం తర్వాత వాతావరణం మారింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై.. ఆ తర్వాత ఏకధాటిగా గంటపాటు వర్షం కురిసింది. గతవారం అక్కడక్కడా వానలు పడగా.. మళ్లీ రెండు రోజులుగా వానలు పడ్డాయి. మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.. సాయంత్రం వరకు ఎండలు మండిపోగా.. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది.. తేలిక పాటి నుంచి మోస్తరు వాన కురిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa