జగన్ సర్కారు ఇటీవలే 24 మంది సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని నియమించిన సంగతి తెలిసిందే. కాగ పాలక మండలిలో కొందరు సభ్యుల నియామకాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రా రెడ్డికి టీటీడీలో సభ్యత్వం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన కేతన్ దేశాయ్ను టీటీడీ బోర్డులోకి తీసుకోవడం పట్ల కూడా విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ బోర్డు నుంచి ముగ్గుర్ని తొలగించాలని కోరుతూ చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తరఫున లాయర్ జడ శ్రవణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నేర చరిత్ర, మద్యం వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడం సరికాదంటూ పిటిషనర్ తన వాదనను వినిపించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, శరత్ చంద్రా రెడ్డి, కేతన్ దేశాయ్ల నియామకాన్ని చింతా వెంకటేశ్వర్లు సవాల్ చేశారు. ఈ ముగ్గుర్నీ టీటీడీ బోర్డు నుంచి తొలగించాలని కోరుతూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా పని చేసిన కేతన్ దేశాయ్ గురించి ఢిల్లీ హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి స్థానంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆగస్టు 10న బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. క్రిస్టియన్ అయిన ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని ఎలా కట్టబెడతారనే ప్రశ్న వినిపించింది. టీటీడీ చైర్మన్గా భూమనను నియమించడం పట్ల ఏపీ బీజేపీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ తర్వాత 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని ప్రకటించారు. ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారికి పాలక మండలిలో చోటు కల్పించారు. తాను క్రిస్టియన్ అని, నాస్తికుణ్ని అని ఆరోపణలు చేస్తున్న వారికి కరుణాకర్ రెడ్డి ఇటీవలే ఘాటుగా సమాధానం ఇచ్చారు. గతంలో టీటీడీ చైర్మన్గా తాను చేసిన అభివృద్ధిని ఏకరువు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa