ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించాలి,,,, అమర్‌నాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 07:12 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చిందనే వార్తలపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. సోమవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి.. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడానికి కారణం ఎవరు..? ఐటీ నోటీసులకు టీడీపీ అధినేత ఎలా సమాధానాలిస్తున్నారనే విషయాలను సైతం వెల్లడించారు. ఎంవీపీ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారన్న మంత్రి.. నారా లోకేశ్‌కి సైతం ఐటీ నోటీసులు అందాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు 46 పేజీల నోటీసులు ఇచ్చారని.. వాటికి ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని అమర్‌నాథ్ తెలిపారు.


ఐటీ అభియోగాలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. బాబు తేలు కుట్టిన దొంగలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నైపుణ్యం మరెవ్వరికీ రాదన్న ఆయన.. ఐటీ అభియోగాలతో తనకు సంబంధం లేదని బాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తీగ లాగితే చంద్రబాబు డొంక కదులుతుందన్నారు. చంద్రబాబు నాయుడు దోచుకున్న సొమ్ములో రూ.118 కోట్లు చాలా తక్కువన్న గుడివాడ అమర్‌నాథ్.. వివిధ కంపెనీల ద్వారా చంద్రబాబు లంచం తీసుకున్నారని.. దుబాయ్ నుంచి లంచాల రూపంలో రూ.118 కోట్లు అందాయనే సమాచారం ఉందన్నారు. ఈ లావాదేవీలో చంద్రబాబు కోడ్ లాంగ్వేజీ వాడారని ఐటీ నోటీసుల్లో పేర్కొందన్నారు. ఈ వ్యవహారం మొత్తం చంద్రబాబు పీఏ ఇచ్చిన సమాచారమేనని మంత్రి తెలిపారు.


చంద్రబాబు నాయుడు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటిషియన్ అంటూ గుడివాడ అమర్‌నాథ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో కూడా బాబు డబ్బులు కాజేశాడని ఆయన ఆరోపించారు. సీమన్స్ పేరు చెప్పి చంద్రబాబు రూ. 350 కోట్లు కొట్టేశాడన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని ప్రజల ముందు పెడతామన్న ఆయన.. ఇంకా చాలా అంశాలు బయటకు వస్తాయన్నారు. చంద్రబాబుని ప్రజా కోర్టులో పెడతామని మంత్రి తెలిపారు. ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు చంద్రబాబు అవినీతిపై దృష్టి సారించాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కోరారు. చంద్రబాబుకి ఇచ్చిన ఐటీ నోటీసులపై జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నా సరే ఆయన ఎందుకు స్పందిచడం లేదని ప్రశ్నించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.


చంద్రబాబు చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసన్న గుడివాడ అమర్‌నాథ్.. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మీద ఇన్ని ఆరోపణలు లేవన్నారు. ఆయన నేరుగా వచ్చి రాజకీయాల్లో రాణించలేదని.. వెన్నుపోటు నాయకుడని ఆరోపించారు. చంద్రబాబు నాయుణ్ని బ్యాక్ డోర్ పొలిటిషియన్‌గా అభివర్ణించిన గుడివాడ అమర్‌నాథ్.. చంద్రబాబుది అవినీతి సామ్రాజ్యమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa