ప్రముఖ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే ముచ్చటగా మూడోసారి వివాహ బంధం లోకి అడుగుపెట్టారు. 68 ఏళ్ల సాల్వే.. తన ప్రియురాలు త్రినాను మూడో వివాహం చేసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. లండన్లో అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ , సునీల్ మిట్టల్, ఎల్ఎన్ మిట్టల్, ఎస్పీ లోహియా, గోపీ హిందూజా, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, ఉజ్వల రౌత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
హరీశ్ సాల్వే కి తొలుత మీనాక్షితో వివాహం కాగా.. మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి 2020 జూన్లో ముగింపు పలికారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా... విడాకులు తీసుకున్నారు. తర్వాత కరోలిన్ బ్రసార్డ్ను పెళ్లి చేసుకోగా.. కొన్నాళ్లకే ఈ పెళ్లి పెటాకులయ్యింది. ఆమె నుంచి కూడా విడిపోయినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా వ్యవహరిస్తున్న హరీశ్ సాల్వే అనేక హై ప్రొఫైల్ కేసులను వాదించారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్లో ఉరిశిక్ష పడిన భారత నౌకాదళ మాజీ ఉద్యోగి కులభూషణ్ జాదవ్ తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో సాల్వే వాదనలు వినిపించారు. అప్పట్లో జాదవ్ తరఫున వాదించేందుకు కేవలం ఒకే ఒక్క రూపాయి ఫీజు తీసుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు.
టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ వంటి కంపెనీల ఎదుర్కొన్న కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ వివాదానికి సంబంధించిన కేసు, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులోనూ వాదించారు. 1999 నుంచి 2002 వరకు భారత సొలిసిటర్ జనరల్గా ఆయన వ్యవహరించారు. న్యాయవ్యవస్థలో ఆయన సేవలకుగానూ 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’పై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీలో హరీశ్ సాల్వే సభ్యుడిగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa