జవాన్ చిత్రం రిలీజ్కు ముందు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో షారుక్, నయనతార పాల్గొన్నారు. షారుక్తోపాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్, మేనేజర్ పూజా డడ్లానీ.. నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు సంప్రదాయ వస్త్రధారణలో స్వామి వారిని దర్శించుకున్నారు. షారుక్, నయనతారకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. దగ్గరుండి మరీ దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అధికారులు వారిని స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన షారుక్ ఖాన్, నయనతారను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మీడియాతో మాట్లాడేందుకు వారు సుముఖత వ్యక్తం చేయలేదు. కట్టుదిట్టమైన భద్రత నడుమ షారుక్ ఖాన్ సోమవారం అర్ధరాత్రి సమయంలో తిరుపతి చేరుకున్నారు. అనంతరం మంగళవారం వేకువ జామున ఆయన స్వామి వారి దర్శనానికి వెళ్లారు. షారుక్ ఖాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. షారుక్ ఖాన్ గత వారమే జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. అంతకు కొద్ది రోజుల ముందు కూడా ఆయన వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు.
షారుక్, నయనతార జంటగా నటించిన జవాన్ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే స్పెషల్ అపియరెన్స్ ఇవ్వనుండగా.. సాన్యా మల్హోత్ర, సునీల్ గ్రోవర్, రిధి డోగ్రా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షారుక్ నటించిన పఠాన్ మూవీ హిట్ కావడంతో.. జవాన్పై భారీ అంచనాలున్నాయి. మరోవైపు షారుక్ కుమార్తె సుహానా నటించిన ‘ది ఆర్కైవ్స్’ చిత్రం డిసెంబర్ 7న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa