ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత పద్దతిలోనూ రిజిస్ట్రేషన్లు.. లేఖర్ల ఆందోళనపై సర్కారు క్లారిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 05, 2023, 01:51 PM

రిజిస్ట్రేషన్‌ విధానంపై ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్‌‌ను ఆన్‌లైన్‌‌తో పాటు ప్రస్తుతమున్న విధానాన్నీ యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దీనికి ఎటువంటి కాలపరిమితి లేదని పేర్కొంది. సెప్టెంబరు 15 తర్వాత కేవలం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌‌ను నిర్వహణకు రిజిస్ట్రేషన్‌ శాఖ సన్నద్ధమవుతోందంటూ దస్తావేజు లేఖర్లు ఆందోళనలకు దిగారు. ఓటీపీ విధానం, ఒరిజినల్‌ దస్త్రాలు ఇవ్వకుండా సాధారణ పత్రాలపై రిజిస్ట్రేషన్‌ జరుగుతుండటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.


ఈ విధానం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందలేమని, ఇతర సమస్యలు ఎదురుకావచ్చన్న సందేహాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌, రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రామకృష్ణ స్పందించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. నూతన ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రస్తుతం రాష్ట్రంలోని 24 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాత్రమే అమలు చేస్తున్నామని ఐజీ రామకృష్ణ వెల్లడించారు. ఈ విధానం అమల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.


ప్రస్తుత విధానంలోనూ రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘కొత్త విధానం అమల్లోకి తెచ్చినప్పటికీ ఫిజికల్‌ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయలేదు.. యథావిధిగా పాత పద్ధతిలోనే 700 రిజిస్ట్రేషన్లు జరిగాయి.. రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తే తదుపరి ప్రక్రియ సులభతరం అవుతుంది.. యజమాని ప్రమేయం లేకుండా తప్పుడు విధానంలో రిజిస్ట్రేషన్లు చేయకుండా నిరోధించవచ్చు. ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను పాస్‌పోర్టు నంబరు ఆధారంగా చేస్తాం.


కొత్త విధానానికి సానుకూల స్పందన వస్తుందని ఊహించాం కానీ ఇలా ప్రచారం జరుగుతుందని భావించలేదు.. తప్పుడు ప్రచారం చేసే వారిపై క్రిమినల్‌ కేసులు పెడతాం.. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను డేటా నుంచి ఎన్ని ప్రింట్లైనా తీసుకోవచ్చు. డాక్యుమెంట్‌పై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది.. దీన్ని స్కాన్‌ చేసి, ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ కాపీ పొందవచ్చు. ప్రింట్‌ తీసుకుని వారసులకు అందజేయవచ్చు.. నకిలీలకు తావుండదు. బ్యాంకర్లకు కొత్త విధానం అమలుపై అవగాహన కల్పిస్తాం. ఆధార్‌ ఉండి వేలిముద్రలు పడని వారిని ఐరిస్‌ ద్వారా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన వివరించారు. ఏపీ సర్కారు కొత్గా కార్డ్‌ ప్రైమ్‌ 2.0 విధానాన్ని తీసుకువస్తోంది. అయితే కొత్త రిజిస్ట్రేషన్‌ విధానంపై ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ప్రభుత్వానికి సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. సర్వర్లు డౌన్‌ కావడంతో రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడగా. ఈ కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు ఆందోళనకు దిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa