ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సోమవారం (సెప్టెంబర్ 4) వేకువజామున నుంచే పలు చోట్ల భారీ వర్షం కురుస్తుండగా.. ఈ వర్షాలు మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 14 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. కోస్తాంధ్ర ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అటు తెలంగాణలోనూ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. దీనికి తోడు ఏపీ, తెలంగాణ మీదుగా మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం కొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ కూడా ఇదే రకమైన హెచ్చరికలు చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపై ప్రవాహం కొనసాగుతోంది. నదులు, జలాశయాల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. కామారెడ్డి జిల్లాలో రహదారిపై చెరువులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో పెన్నానది ప్రవాహంలో చిక్కుకున్న నలుగురు యువకులను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa