ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లండన్ పర్యటనలో ఉన్న సీఎం జగన్,,,సెప్టెంబర్ 9న జగన్‌తో మీట్ అండ్ గ్రీట్ అంటూ ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 07:25 PM

ఏపీ సీఎం జగన్ ఫ్యామిలీ టైంను ఎంజాయ్ చేస్తున్నారు. తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లిన ఆయన.. తన కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డితో కలిసి సరదాగా గడుపుతున్నారు. సాధారణంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు.. ఎన్నారైలు, ఆ పార్టీకి సంబంధించిన ఎన్నారై విభాగాలు ఆయన్ను కలిసి మాట్లాడటం సహజం. కానీ జగన్‌ది పూర్తిగా వ్యక్తిగతమైన పర్యటన కావడంతో.. ఆయన లండన్‌లో ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారనే విషయాలు వైఎస్సార్సీపీ నేతలకు కూడా తెలీదు.


సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి ప్రత్యేక విమానం లండన్ బయల్దేరి వెళ్లిన జగన్ దంపతులు తిరిగి 12వ తేదీన తిరిగి రానున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టు ఆయనకు అనుమతులిచ్చింది. జగన్ లండన్ పర్యటన ఖరారైన నాటి నుంచి ఆయనపై ప్రత్యర్థి వర్గం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగుతోంది. కోర్టు పర్మిషన్ లేకుండా తన బిడ్డలను చూసేందుకు వెళ్లలేని వాడు.. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడంటూ మొదలైన ట్రోలింగ్.. ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది.


లండన్ పర్యటనలో ఉన్న జగన్ సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ అందుబాటులో ఉంటారని.. వచ్చి కలవొచ్చని.. లంచ్ కూడా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ ఫ్లయర్ (ప్రకటన) వైరల్ అయ్యింది. మీట్ అండ్ గ్రీట్ విత్ అవర్ లీడర్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ ఈ ప్రకటనను పొందుపర్చారు. లండన్‌ ఎంహెచ్‌సీ సెంటర్ ఇందుకు వేదిక అంటూ ఆహ్వానితుల వివరాలేవీ లేకుండా ఈ ఫ్లయర్‌ను వదిలారు.


జగన్ అభిమానులు ఇలా చేశారేమో అనుకుంటున్నారా..? కాదు ఆయనంటే ఏమాత్రం గిట్టని బ్యాచ్ పనే ఇది. ఎందుకంటే వేదికగా ప్రకటించిన లండన్ ఎంహెచ్‌సీ సెంటర్ అంటే.. లండన్ మెంటల్ హెల్త్ కేర్ సెంటర్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా..? జగన్‌‌‌కు మానసిక సమస్యలు ఉన్నాయని.. ఆయన లండన్‌లో చికిత్స పొందుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే ఆరోపిస్తారనే సంగతి తెలిసిందే. రాయదుర్గంలో రైతులతో సమావేశమైన సందర్భంగానూ చంద్రబాబు నాయుడు జగన్‌ను ఉద్దేశించి ఈ తరహా ఆరోపణలు గుప్పించారు.


జగన్‌‌ను లండన్‌లో కలవొచ్చనే ఫ్లయర్ వైరల్ కావడంతో.. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ ప్రదీప్ చింతా స్పందించారు. జగన్ లండన్ పర్యటన పూర్తి వ్యక్తిగతమన్న ఆయన.. ఈ టూర్ గురించి మీకెంత తెలుసో.. మాకు కూడా అంతే తెలుసన్నారు. యూకేలో ఏ మీటింగ్‌‌ను నిర్వహించడం లేదని.. ఎవరో ఆకతాయిలు కావాలనే వాట్సాప్‌లో దాన్ని సర్క్యులేట్ చేసి వైరల్ చేస్తున్నారని.. దాన్ని పట్టించుకోవద్దని ఆయన సూచించారు. జగన్‌తో ఎలాంటి మీటింగ్‌లు లేవని స్పష్టం చేశారు. అయితే ఆ ఫ్లయర్‌‌ వెనుకున్న ఉద్దేశాన్ని మాత్రం ఆయన అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయంగా ఎన్నైనా విమర్శించుకోవచ్చు గానీ.. ఫ్యామిలితో టైం స్పెండ్ చేయడానికి వెళ్లిన సీఎం మీద.. ఆయన హోదాకు సైతం గౌరవం ఇవ్వకుండా ఇలాంటి ఫ్లయర్లు వదలడం సరికాదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa