విశాఖ ఆర్కే బీచ్లో కోస్టల్ బ్యాటరీ నుంచి నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న చిల్డ్రన్ పార్కు వరకు సముద్ర తీరంలో ఇసుక తిన్నెలు నల్లగా మారాయి. ఇలా ఇసుక రంగు మారడం చర్చనీయాంశమైంది. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని భావిస్తున్నారు. అయితే అది కారణం కాదని నిపుణులు చెబుతున్నారు.. ఇసుకలో ఉండే లైట్, హెవీ మినరల్స్ విడిపోవడం వల్లే తీరం నల్లగా మారింది అంటున్నారు.
వాతావరణ మార్పుల వల్ల అలల ఉధృతి పెరిగినప్పుడు తీరంలో ఉండే లైట్ మినరల్స్ నీటితోపాటు సముద్రం లోపలకు వెళతాయట. హెవీ మినరల్స్ తీరంలోనే ఉండిపోతాయట.. బరువుగా ఉండే ఈ మినరల్స్లో ఎక్కువగా ఇలమనైట్, రుటైల్, జింకాన్, గార్నెట్, సిలిమినైట్ వంటివి ఉంటాయంటున్నారు. బీచ్ నల్లగా మారడానికి ప్రధానంగా ఇలమనైట్, రుటైల్ వంటి హెవీ మినరల్స్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు నల్లగా ఉండడం వల్లే తీరమంతా ఆ రంగులోకి మారుతుందంటున్నారు.
సాధారణంగా అలలు తాకిడి ఎక్కడ అధికంగా ఉంటుందో అక్కడ ఇలాంటి పరస్థితి ఉత్పన్నమవుతుందంటున్నారు. రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పుల కారణంగా అలల తాకిడి పెరిగిందని.. ఈ కారణంగానే తీరంలో హెవీ మినరల్స్, లైట్ మినరల్స్ విడిపోయి ఇసుక తిన్నెలు నల్లగా మారాయని చెప్పారు. వేవ్ యాక్షన్ అధికంగా ఉన్నచోట ఇటువంటి మార్పును చూడొచ్చన్నారు. అలాగే కాలుష్యం కారణంగానే ఇలా రంగు మారుతుందా అనే చర్చ మొదలైంది. అలాగే డ్రైనేజ్ నీళ్లు, పనికిరాని వస్తువుల్ని పడేయటం వల్ల ఇలా జరిగిందంటున్నారు
బీచ్లో ఇసుక రంగు నల్లగా మారడంతో పర్యాటకులతో పాటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రాంతం ఇలా కావడం చర్చనీయాంశమైంది. అయితే స్థానికులు మాత్రం విశాఖలో మొత్తం 10 ప్రాంతాల్లో డ్రైన్ వాటర్ వచ్చి సముద్రంలో కలుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అందుకే బీచ్ అందం మొత్తం పాడైపోతుందంటున్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది ఆగస్టులో కూడా సరిగ్గా ఇలాగే సముద్ర తీరం మొత్తం నల్లగా మారిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa