ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన సమాచారాన్ని పౌరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో 2005 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టాన్ని ఉపయోగించుకుని ఏ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సమాచారమైనా తెలుసుకునే హక్కు ప్రజలకు కల్పించింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి భూ విజ్ఞాన శాఖకు చేసిన దరఖాస్తు చాలా ఫన్నీగా మారింది. సరైన సమయంలో వర్షాలు ఎందుకు పడటం లేదంటూ ప్రశ్నించాడు. దీంతో ప్రస్తుతం ఈ ఆర్టీఐ దరఖాస్తు చాలా చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 గురించి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశాడు.
బిహార్కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కేంద్ర భూవిజ్ఞాన శాఖ అధికారులకు విచిత్రమైన దరఖాస్తు చేశారు. వర్షా కాలంలో ఎండలు, ఉక్కపోతతో విసిగిపోతున్నట్లు తెలిపాడు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలిపారు. దీనికి ఖచ్చితమైన కారణమేంటో తెలపాలని కేంద్ర భూ విజ్ఞాన శాఖను కోరాడు. తాను అడిగిన ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేకపోతే.. అవసరం అనుకుంటే దేవుడిని అడిగైనా సరే తనకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ దరఖాస్తులో పేర్కొన్నారు. అంతేకాకుండా తన దరఖాస్తులో దేవుడిని కూడా ఓ ప్రతివాదిగా చేర్చడం గమనార్హం.
వర్షా కాలం ప్రారంభమై కొన్ని వారాలు గడిచినా బిహార్లో సరైన వర్షాలు పడలేదు. దీంతో బిహార్ వాసులు ఎన్నో అవస్థలు పడుతున్నారని.. గౌరాబౌరమ్ జిల్లా మహౌర్కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త రాజ్కుమార్ ఝా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు వర్షాలు పడకపోవడానికి కారణమేంటో చెప్పాలని భూ విజ్ఞాన శాఖకు ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు పంపించాడు. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం అవసరమైతే దేవుడిని అడిగి తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. దీని కోసం ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం ఏమైనా ఉపయోగపడుతుందేమో పరిశీలించాలని కూడా కోరారు.
దేవుడు సకాలంలో వర్షాలు ఎందుకు కురిపించడం లేదని.. చంద్రుడిపై చంద్రయాన్ 3 అడుగుపెట్టిన తర్వాత ప్రకృతి కదలికలు ఆగిపోయాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన సమాధానం చెప్పాలని అడిగారు. టెక్నాలజీని ఉపయోగించి అయినా సరే తన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని రాజ్కుమార్ ఝా పేర్కొన్నారు. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చక్కర్లు కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్కు అమర్చిన అధునాతన పరికరాల వల్లే ఇలా ప్రకృతి స్తంభించిపోయి ఉంటుందని రాజ్కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆర్టీఐ దరఖాస్తుపై రాజ్కుమార్ ఝాను మీడియా ప్రశ్నించింది. దానికి సమాధానం ఇచ్చిన ఆయన.. చంద్రయాన్ 3 లోని ప్రజ్ఞాన్ రోవర్ దేవుడి నుంచి సంకేతాలను సేకరించి ల్యాండర్ సాయంతో ఇస్రోకు అందిస్తుందని చెప్పారు. అదే విధంగా పరిశోధనలు జరిపి వాతావరణ మార్పులకు గల కారణాలను తెలుసుకోవచ్చని కూడా రాజ్కుమార్ ఝా సూచించారు. ప్రస్తుతం ఈ ఆర్టీఐ దరఖాస్తుకు సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa