ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీ 20 సదస్సు వేళ ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం,,,సెంట్రల్ ఢిల్లీలో చక్కర్లు కొట్టిన డ్రోన్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 09, 2023, 08:13 PM

ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అధినేతలు, దేశంలోని ముఖ్య నేతలు అంతా దేశ రాజధాని ఢిల్లీలో భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి భద్రతా పరంగా కొన్ని రోజుల ముందునుంచే అన్ని పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో జీ20 సమావేశాల సందర్భంగా నో ఫ్లై జోన్ కూడా ప్రకటించారు. గగనతంలో యాంటీ డ్రోన్‌ వ్యవస్థతో నిరంతరం గస్తీ కాస్తున్నారు. అయితే ఇంత పటిష్ఠ చర్యలు తీసుకున్నా సెంట్రల్ ఢిల్లీలో తాజాగా ఓ డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు.


సెంట్రల్ ఢిలోని పటేల్‌ నగర్‌ ప్రాంతంలో డ్రోన్‌ ఎగురుతున్న వీడియో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో డ్రోన్‌ చక్కర్లు కొట్టిన సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే పటేల్ నగర్‌లో నిర్వహించిన ఓ బర్త్‌డే పార్టీలో డ్రోన్‌ను ఎగురవేసినట్లు గుర్తించారు. బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియోను తీసేందుకు ఫొటోగ్రాఫర్లు డ్రోన్‌ కెమెరాను ఉపయోగించినట్లు తెలిపారు. అయితే ఢిల్లీలో నో ఫ్లై జోన్‌ ఆంక్షలను ఉల్లంఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై ఐపీసీ 188 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మరోసారి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం విధించిన నో ఫ్లై ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


ఇక ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న భారత్ మండపంలో రెండు రోజుల జీ 20 సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొరాకోలో సంభవించిన భారీ భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు మొరాకోకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. జీ20 సభ్య దేశాలను విస్తరిస్తూ ఆఫ్రికన్ యూనియన్‌కు ఆహ్వానిస్తూ.. శాశ్వత సభ్య దేశం హోదాను కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa