టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జడ్జి ముందు హాజరుపరచడంలో మరింత ఆలస్యం జరిగేటట్లు కనిపిస్తోంది. ఆదివారం ఉదయం వేకువజామున 5 గంటల సమయంలో జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉందని అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు నాయుణ్ని నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. నేరుగా విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. సుమారు 5 గంటల పాటు చంద్రబాబును సిట్ అధికారులు విచారించారు. విచారణకు చంద్రబాబు నాయుడు సహకరించడంలేదని సిట్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబును కోర్టు ముందు హాజరుపరిచేందుకు ఎంత సమయం పడుతుంతో చెప్పలేనని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతో తనకు సంబంధంలేదని సిట్ అధికారులతో చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సమాచారం. అయితే, పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీ ప్రతినిధుల చాటింగ్ను, కొన్ని సాక్షాధారాలను చంద్రబాబు నాయుడు ముందు సిట్ అధికారులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు 20 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఆ ప్రశ్నలన్నింటికీ తనకు తెలియదని సమాధానం చెప్పిన టీడీపీ అధినేత.. తాను కోర్టులోనే తేల్చుకుంటానని విచారణ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలోని బృందం చంద్రబాబు నాయుడుని సుదీర్ఘంగా ప్రశ్నించింది. చంద్రబాబు నాయుడికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయణ్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మరోవైపు.. చంద్రబాబు నాయుడిని కలిసేందుకు నారా లోకేష్, భువనేశ్వరి సిట్ కార్యాలయం వద్దకు వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి వచ్చారు. భువనేశ్వరి, బ్రాహ్మణి.. సిట్ కార్యాలయం వద్ద నుంచి తిరిగి వెళ్లిపోగా.. లోకేష్, బాలకృష్ణ అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడిని కలిసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయల్దేరారు. విజయవాడ సమీపంలో ఆయణ్ని అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడిని కలిసేందుకు పవన్ కళ్యాణ్కు అనుమతి ఇవ్వలేమని.. కుటుంబసభ్యులను మాత్రమే అనుమతించామని పోలీసులు చెబుతున్నారు. అటు విశాఖపట్నంలో పోలీసులు అరెస్టు చేసిన టీడీపీ నేతలు స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. గంటా శ్రీనివాసరావు, గణబాబు, దువ్వారపు రామారావును స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa