‘వసుదైక కుటుంబం.. ఒకే భూమి.. ఒకే కుటుంబం’ అనే నినాదంతో భారత్ మొదటిసారిగా జీ20 శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తోంది. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన ఈ సదస్సు రెండు రోజులు జరగనుంది. అధ్యక్ష హోదాలో భారత్ ఏడాది పొడవునా 60 నగరాల్లో అనేక అంశాలపై చర్చలు, సమావేశాలు నిర్వహించింది. చివరిగా శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలనే ప్రచారం నేడు పతాక స్థాయికి చేరుకుంది. అయితే, ఇంతకీ జీ20 అంటే ఏంటి? ఈ కూటమి ఏర్పాటు లక్ష్యం ఏంటి? ఇందులో ఏఏ దేశాలకు సభ్యత్వం ఉంది? సదస్సులు ఎందుకు నిర్వహిస్తారు? అనేది క్లుప్తంగా..
1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి ఓ గ్రూపు ఏర్పాటు చేయాలని భావించాయి. దీంతో 1999 బెర్లిన్లో తొలిసారి జీ20 సదస్సును నిర్వహించారు. వాస్తవానికి జీ20కి ప్రధాన కార్యాలయం ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చూసుకుంటుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ20ని ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూపులు వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. ఆ గ్రూప్లో ఓటింగ్ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో భారత్కు ఈ ఏడాది అవకాశం వచ్చింది.
జీ20 అనేది 20 దేశాల కూటమి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే వేదిక. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను జీ20 వేదికగా దేశాధినేతలు చర్చించి, పరిష్కారాలను కనుగునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కూటమిలోని దేశాలు ప్రపంచ ఉత్పత్తిలో 85 శాతం, వాణిజ్యంలో 75 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని రెండొంతులు జనాభా ఈ దేశాల్లోనే ఉంది.
అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, తుర్కియే, యూకేతో పాటు స్పెయిన్ శాశ్వత అతిథిగా ఉంది. ఈ జీ20 దేశాల్లోని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికాలు బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లు కొత్తగా చేరనున్నాయి. ఈ ఆరు దేశాలకు ఆహ్వానాలు అందాయి.
గతంలో జరిగిన సమావేశాల్లో జీ20 దేశాధినేతలు కేవలం ఆర్థిక అంశాలనే కాకుండా వాతావరణ మార్పులు, సస్టెయినబుల్ ఎనర్జీ, బహుళ జాతి సంస్థలపై సుంకాల విధింపు వంటి అంశాలపై చర్చించారు. ఏటా ఒక సభ్య దేశం జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలను తీసుకుని.. ఏయే అంశాలపై చర్చించాలనే అజెండాను కూడా రూపొందిస్తుంది. గతేడాది ఇండోనేషియా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించగా.. శిఖరాగ్ర సదస్సు బాలిలో జరిగింది. తాజాగా, ఢిల్లీలో జరుగుతోన్న ఈ సదస్సు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. అలాగే, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక వృద్ధిని విస్తృతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, పేదరికంపై పోరాటానికి ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు తీసుకోవాల్సిన చర్యలు వంటి విషయాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడతారని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు దూరంగా ఉన్నారు.
కీలక సమావేశాల అనంతరం దేశాధినేతలంతా కలిసి ఫోటో దిగడం ఆనవాయితీ. దానినే ఫ్యామిలీ ఫోటోగా వ్యవహరిస్తారు. అయితే, ఆ ఫోటో ద్వారా పలు దేశాల మధ్య నెలకొన్న విబేధాలు అప్ప్పుడప్పుడూ బహిర్గతం అవుతూ ఉంటాయి. 2018లో ఇస్తాంబుల్ సౌదీ కాన్సులేట్ వద్ద జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యతో యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన ఫోటోలో చివర్లో నిలబడడం కనిపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa