టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంతో ఏపీ అట్టుడుకుతోంది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేశారనే వార్తలు విని కొంత మంది కార్యకర్తల గుండెలు ఆగిపోయాయి. మరికొంత మంది అభిమానులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సత్యసాయి జిల్లాలో ఓ కార్యకర్త సెల్ టవర్ ఎక్కాడు. చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలని.. లేకపోతే, సెల్ టవర్ మీద నుంచి దూకి చనిపోతానంటూ కలకలం సృష్టించాడు. అయితే, అతడిని కిందికి తీసుకువచ్చేందుకు పోలీసులు వేసిన వ్యూహం ఫలిచింది. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని, ఆయన బయటకు వచ్చారని చెప్పగానే.. ఆ కార్యకర్త సెల్ టవర్ మీద నుంచి కిందకి దిగి వచ్చాడు.
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన మంజునాథ్ టీడీపీ కార్యకర్త. తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు నాయుడు అన్నా ఆయనకు అమితమైన అభిమానం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారనే వార్త విని మంజునాథ్ ఆందోళనకు గురయ్యాడు. టీడీపీ జెండా చేత పట్టుకొని సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని, లేకుంటే.. సెల్ టవర్ మీద నుంచి దూకుతానని హెచ్చరించాడు. మంజునాథ్ సెల్ టవర్ ఎక్కిన విషయాన్ని స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంజునాథ్కు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. అతడు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు తెలివిగా వ్యవహరించారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని, ఆయన బయటకు వచ్చారని నమ్మించి, మంజునాథ్ను కిందకు దింపారు. పోలీసుల మాటలు నిజమని నమ్మిన మంజునాథ్.. సెల్ టవర్ మీద నుంచి కిందకు దిగొచ్చారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa