ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు అరెస్టు వార్తలతో ఆగిన గుండెలు,,,రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురి మృతి, ఒకరు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 10, 2023, 06:29 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారనే వార్త విని.. రాష్ట్రంలో పలువురు అభిమానుల గుండెలు ఆగిపోయాయి. తమ అభిమాన నాయకుడి అరెస్టును జీర్ణించుకోలేక మరికొంత మంది అభిమానులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే ఏడుగురు మృతి చెందగా.. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో మరో కార్యకర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని టెంకాయచెట్లపాలెం గ్రామానికి చెందిన వాయుల సుందరరావు (28) ఆదివారం (సెప్టెంబర్ 10) ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే సుందరరావుకు నారా చంద్రబాబు నాయుడు అంటే అమితమైన అభిమానమని బంధువులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని తెలిపారు.


చంద్రబాబు నాయుణ్ని అరెస్టు చేసిన వార్తలు టీవీ ఛానెల్స్‌లో విని సుందరరావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడని బంధువులు తెలిపారు. శనివారం ఉలవపాడు, కందుకూరులో నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడని చెప్పారు. నిరసన కార్యక్రమంలో పాల్గొని, స్వగ్రామానికి తిరిగొచ్చిన తర్వాత.. చంద్రబాబు విషయంపై గ్రామస్థులతో చర్చిస్తూ సుందరరావు మనస్తాపానికి గురయ్యారని.. రాత్రి 9 గంటల వరకు అదే విషయంపై పదేపదే మదనపడ్డాడని బంధువులు తెలిపారు. ఆదివారం ఉదయం సొంత ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ‘సుందరరావుకు చంద్రబాబు నాయుడు అంటే ప్రాణం. ఆయన అరెస్టు గురించి టీవీలో చూసినప్పుడు నుంచి ఆవేదనకు గురయ్యాడు. చివరికి ప్రాణాలు తీసుకున్నాడు’ అని కుటుంబ సభ్యులు తెలిపారు.


అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మపురం టీడీపీ నాయకుడు వడ్డే ఆంజనేయులు (65) శనివారం ఉదయం టీవీలో చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తను చూసి గుండెపోటుతో మృతి చెందారు. 30 ఏళ్ల నుంచి టీడీపీలో క్రియాశీలకంగా ఉంటున్న ఆయన ఇటీవల జరిగిన పంచాయతీ వార్డు సభ్యుల ఉప ఎన్నికలో టీడీపీ మద్దతుదారుగా పోటీ చేసి గెలిచారు. డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన చెల్లుబోయిన నరసింహరావు (62).. టీవీల్లో చంద్రబాబు అరెస్టు వార్తలు చూస్తూ కలత చెంది, గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. కోనసీమ జిల్లాకు చెందిన కాకర సుగుణమ్మ (65)కు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం. కాట్రేనికోన మండలం రామస్వామి తోటలో తన మనవడి సెల్‌ఫోన్‌లో చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వార్తలు చూస్తూ.. గుండెపోటుతో మృతి చెందారు.


విజయనగరం జిల్లా గజపతినగరం మండలం జిన్నాంకు చెందిన టీడీపీ కార్యకర్త ఇజ్జిరోతు పైడితల్లి (67) గుండెనొప్పితో మరణించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా గజపతినగరంలో నిర్వహించే ఆందోళనకు బయల్దేరుతుండగా అస్వస్థతకు గురైన పైడితల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెం ఎస్సీ కాలనీకి చెందిన వెంకటరమణ (46)కు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం. చంద్రబాబు అరెస్టు వార్తలను టీవీలో చూస్తూ.. కలత చెంది గుండెపోటుతో కుప్పకూలారు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం తాడేపల్లికి చెందిన కొడాలి సుధాకరరావు (60) చంద్రబాబు నాయుడికి వీరాభిమాని. చంద్రబాబు అరెస్టు వార్తను టీవీలో చూస్తూ గుండెపోటుకు గురై మృతి చెందారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారని కుటుంబసభ్యులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa