ఆఫ్రికా దేశమైన మొరాకోలో భూకంప మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 2 వేలు దాటింది. మరో 1400 మంది తీవ్రంగా గాయపడ్డారని మొరాకో ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం కారణంగా మర్రాకేష్, దాని సమీపంలోని ప్రావిన్సుల ప్రజలు వణికిపోయారు. మరోసారి భూమి కంపిస్తుందనే భయంతో ఆ ప్రాంతాల ప్రజలు రోడ్లపై రాత్రంతా జాగారం చేశారు. మొరాకోలో వచ్చిన భూకంపంలో అనేక మంది విదేశీ పర్యాటకులు సైతం చిక్కుకుపోయారు. ‘నా అన్వేషణ’ పేరిట ప్రపంచ దేశాలను చుట్టి వస్తోన్న తెలుగు యూట్యూబర్ సైతం భూకంపం వచ్చిన సమయంలో మొరాకోలోనే ఉన్నారు. భూ ప్రకంపనలు నమోదయ్యాక.. వీధుల్లోకి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చిన అన్వేష్.. అక్కడి పరిస్థితిని మన కళ్లకుగట్టే ప్రయత్నం చేశారు.
జనమంతా అరుస్తూ.. ఇళ్లు ఖాళీ చేసి వీధుల్లోకి పరిగెట్టడాన్ని అన్వేష్ రికార్డ్ చేశారు. భూకంపాన్ని తాను తొలిసారి దగ్గర్నుంచి చూశానన్న అన్వేష్.. భూకంపం మళ్లీ రావొచ్చనే ప్రభుత్వం హెచ్చరికలతో తామంతా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చామన్నారు. మొరాకోలో రిక్టర్ స్కేల్పై 6.8 తీవ్రతతో భూకంపం నమోదైందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర స్టయిల్లో ఓలమ్మా.. ఓలప్పా.. అంటూ ఆయన భూకంపం సంభవించిన ప్రదేశం నుంచి రిపోర్టింగ్ చేశారు. ‘యూ ఫస్ట్ టైం?.. భూకంపాన్ని చూడటం ఇదే తొలిసారా..? అని తోటి టూరిస్టులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
చైనా, ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన పర్యాటకులు తనతోపాటు ఉన్నారన్నారని అన్వేష్ తెలిపారు. తామంతా సురక్షిత ప్రదేశానికి చేరుకున్నామన్నారు. అందరూ ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రదేశాలకు చేరుకొని రాత్రంతా జాగారం చేశారని అన్వేష్ తెలిపారు. భూకంపం రాగానే తాను బయటకు పరిగెత్తి.. అందర్నీ అప్రమత్తం చేశానన్నారు. గ్వాటిమాలలోని ఎల్సాల్వెడర్లో ఉన్నప్పుడు తను భూకంపాన్ని ఎదుర్కొన్నానన్నారు. ఆ అనుభవం ఇప్పుడు పనికొచ్చిందన్నారు. వేలాది మంది ప్రజలు ఖాళీ ప్రదేశంలోకి వచ్చిన దృశ్యాలను ఆయన చూపించారు. హాస్టల్ ఓనర్ తమను సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చాడని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa