ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అరెస్టు చేయగా.. తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా కోర్టులో వాడీవేడి వాదనలు కూడా జరిగాయి. చివరకు రిమాండ్ విధిస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ టీడీపీ శ్రేణులు బంద్కు పిలుపునివ్వగా.. భద్రతా కారణాల రీత్యా రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంది.
ఈ సంగతి కాసేపు పక్కనబెడితే.. చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ పడిపోతోంది. అరెస్టు ప్రభావం దీనిపై కనిపించింది. ఇన్వెస్టర్లు షేర్లను అమ్ముతున్న నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే ఈ వార్త రాసే సమయానికి (మధ్యాహ్నం గంటల సమయంలో) 6 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం రూ.255 వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ షేర్లను ప్రస్తుత పరిస్థితుల్లో కొనాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు ఇన్వెస్టర్లు. కొద్దిరోజులు ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు ఉంటాయని వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది.
హెరిటేడ్ ఫుడ్స్ విషయానికి వస్తే.. 1992లో ఇది ప్రారంభమైంది. వ్యవస్థాపకులుగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు. చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఈ కంపెనీలో సుమారు 3 వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ విలువ 2.37 ట్రిలియన్ కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ.287.35గా ఉండగా.. కనిష్ట విలువ రూ. 135.15 గా ఉంది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ ఎంటర్ప్రైజెస్ల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఇప్పుడు హెరిటేజ్ ప్రొడక్ట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, దిల్లీ, కేరళలకు కూడా వెళ్తున్నాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్లో మంచి లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 67 వేల మార్కు వద్ద ఉండగా.. నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 19 వేల 960 మార్కు వద్ద ట్రేడవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa