కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన యుద్దం సాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాదులపట్ల ప్రభుత్వం చర్యలు నిష్క్రియాత్మకంగా ఉండటం, అదే సమయంలో ఉగ్రవాద మూకల బెదిరింపుల వల్ల హిందూ కెనడియన్లు భయానికి గురవుతున్నారని అధికార లిబరల్ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. చంద్ర ఆర్య... కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకి చెందిన ఎంపీ కావడం గమనార్హం. హిందూ కెనడియన్లు పదేపదే హెచ్చరికలు ఎదుర్కొంటున్నారన్నారు. హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల సమయంలో కెనడాలోని హిందువులు భారత్కు తిరిగి వెళ్లాలని గుర్పత్వంత్ సింగ్ పన్నుతో పాటు పలువురు వేర్పాటువాద తీవ్రవాదులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎంపీ చంద్ర ఆర్య ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయన సీబీసీ న్యూస్తో మాట్లాడుతూ... ప్రధాని (ట్రూడో) ప్రకటన తర్వాత ఏం జరుగుతుందోనని కెనడాలోని హిందువులు భయపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు కారణాలను చెప్పారు. ఖలిస్థాన్ హింస, చరిత్ర అంతా రక్తపాతమేనని, వీరి కారణంగా పదివేల మంది హిందువులు, సిక్కులు మరణించారన్నారు. 38 ఏళ్ల క్రితం కెనడా నుంచి ఇండియా వెళ్తున్న ఎయిరిండియా విమానంపై బాంబు దాడి, 9/11కు ముందు జరిగిన అతిపెద్ద విమానయాన ఉగ్రదాడి అని తెలిపారు. కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిరిండియాపై దాడి చేసిన ఉగ్రవాదులను ఆరాదించడం వాస్తవమే అన్నారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన విధానాన్ని కెనడాలో ఓ ర్యాలీలో శకటంపై ప్రదర్శించారని, ఇది ఖండించదగ్గ అంశమన్నారు. ప్రధానిగా ఉన్న వ్యక్తి హత్యను, అందుకు సంబరాలు చేసుకోవడాన్ని ఏ దేశం అనుమతిస్తుందో చెప్పాలన్నారు. మరో విషయం ఏమంటే గుర్పత్వంత్ సింగ్ వంటి వారు హిందూ కెనడియన్లను కెనడా వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి చాలామంది సిక్కులు, కెనడియన్లు ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతివ్వడం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa