ఆర్టీసీ బస్సుల్లో కొందరు ప్రయాణికులు హడావిడిలో లగేజీని మర్చిపోతుంటారు. కానీ డ్రైవర్, కండక్టర్ ఆ వస్తువుల్ని గుర్తించి తిరిగి వారికి అప్పగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బాపట్ల జిల్లా అద్దంకిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆర్టీసీ బస్సులో ఓ పాత సూట్కేస్ను డ్రైవర్ గుర్తించాడు.. పాతది కదా అని చెత్తలో పడేద్దామనుకున్నాడు. కానీ ఎందుకో మనసు మార్చుకుని తీసుకెళ్లి డిపోలో అప్పగించారు.. అందులో ఏముందని తీసి చూసి అవాక్కయ్యారు.
అద్దంకి మండలం కలవకూరుకు చెందిన కుంచాల వెంకటేశ్వర్లు బేల్దారి మేస్త్రీ. ఆయన తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంలో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరికి వచ్చారు. బుధవారం ఉదయం తిరిగి కొత్తగూడెం బయల్దేరారు.. ఈ క్రమంలో అద్దంకి నుంచి విజయవాడకు ప్రయాణించిన వెంకటేశ్వర్లు తన సూట్కేసును బస్సులోనే మరిచిపోయి దిగి వెళ్లిపోయారు. సాయంత్రం ఆర్టీసీ బస్సు అద్దంకి డిపోకు తిరిగి వచ్చేసింది.
బస్సులో ఉన్న సూట్కేసును డ్రైవర్ ఎంఆర్ఎస్ రెడ్డి గుర్తించారు. పాత సూట్కేసు కావడంతో చెత్తలో పడేద్దామనుకున్నారు. కానీ మనసు మార్చుకుని ఆర్టీసీ గ్యారేజి దగ్గర సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో తెరవగా.. అందులో బంగారు, వెండి ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయి. ఊహించని పరిణామంతో అందరూ అవాక్కయ్యారు.. సుమారు రూ.ఐదు లక్షల విలువైనవిగా తెలుసుకుని డిపో మేనేజర్కు సమాచారం ఇచ్చారు. ఆభరణాల సూట్కేసులోని రసీదును పరిశీలించి బాధితుడికి సమాచారం అందించారు.
అప్పటికే వెంకటేశ్వర్లు కొత్తగూడెం వెళ్లిపోయారు.. ఆర్టీసీ అధికారులు సూట్కేస్ గురించి చెప్పారు. కంగారు పడిన ఆయన కలవకూరులో నివసించే సోదరిని ఆర్టీసీ డిపో వద్దకు పంపించారు. సూట్కేసుతో పాటుగా అందులోని వస్తువుల్ని ఆమెకు అప్పగించారు. నిజాయతీగా సూట్కేసును అప్పగించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎంఆర్ఎస్ రెడ్డిని పలువురు ప్రశంసించారు. అలాగే వెంకటేశ్వర్లు కూడా డ్రైవర్కు ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa