తిరుమలలో డబ్బు చెల్లింపు విధానాలను సులభతరం చేస్తోంది టీటీడీ. శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల కొనుగోలుతో పాటు గదుల బుకింగ్ సమయంలో డబ్బు చెల్లించే విధానంలో మార్పులు చేస్తోంది. పేలింక్ మెసేజ్ల ద్వారా సొమ్ము బదిలీ చేసే విధానాలను మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం తిరుమలలోని సీఆర్వోలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్లో కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.. భక్తులు పేలింక్ ద్వారా సొమ్ము బదిలీ చేస్తున్నారు. భక్తులు ప్రత్యక్షంగా కౌంటర్ దగ్గరకు వచ్చి క్యూ లైన్లో ఉండాల్సిన పని తప్పింది.. టికెట్లు కొనాల్సిన ప్రయాస తప్పింది. ఇదే విధానాన్ని ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు, సీఆర్వో పరిధిలోని గదుల కేటాయింపునకూ వర్తింపజేయాలని టీటీడీ ఐటీ శాఖ ఆలోచన చేస్తోంది.
భక్తులు బ్రేక్ దర్శనాలకు దరఖాస్తు చేస్తే.. వారికి టికెట్ ఖరారు చేసిందీ, లేనిదీ సాయంత్రం తర్వాతే నుంచి మెసేజ్ వస్తుంది. టిక్కెట్ ఖరారైన భక్తులు బ్రేక్ దర్శనం దరఖాస్తు రసీదు, మెసేజ్ను చూపించి ఎంబీసీ-34 కౌంటర్లో టికెట్ పొందాల్సి ఉంటుంది. దీని కోసం రోజంతా తిరుమలలోనే గడపాల్సి వస్తోంది. బ్రేక్ దర్శనం కేటాయించకపోయినా.. రాత్రి వరకూ నిరీక్షించక తప్పదు. అదే, పే లింక్ విధానం అమలుచేస్తే భక్తుల ఇబ్బందులు ఉండవని.. కొండపై రద్దీని నియంత్రించవచ్చని టీటీడీ భావిస్తోంది.
బ్రేక్ దర్శనం ఖరారైన భక్తులకు పే లింక్ ఎస్ఎంఎస్ పంపిస్తే.. వారు దానిపై క్లిక్ చేసి సొమ్ము చెల్లించవచ్చు. ఆ తర్వాత ఆన్లైన్లో టికెట్ పొంది, ప్రింట్ తీసుకుని నేరుగా దర్శనానికి వెళ్లొచ్చు. అలాగే ఆఫ్లైన్లో గదుల కేటాయింపునకూ ఇదే పద్ధతిని పరిశీలిస్తున్నట్లు ఈడీపీ విభాగం చెబుతోంది.భక్తులు సీఆర్వోలో ఆధార్, మొబైల్ నంబర్లు ఇస్తే, గదుల లభ్యతను బట్టి ఆ ఫోన్ నంబర్కు గదిని కేటాయిస్తూ పే లింక్ ఎస్ఎంఎస్ పంపిస్తారు. ఆన్లైన్లోనే గది అద్దె, కాషన్ డిపాజిట్ కూడా చెల్లించవచ్చు. తద్వారా విచారణ కార్యాలయాల దగ్గర రద్దీని తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ మార్పులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు ఈడీపీ సిబ్బంది చెబుతున్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబర్ 10 నుండి 12వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అక్టోబర్ 9న సాయంత్రం అంకురార్పణ జరుగనుంది.యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబర్ 10న పవిత్ర ప్రతిష్ఠ, అక్టోబర్ 11న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబర్ 12న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జరుగనుంది. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa