ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇటలీకి జనసేనాని పయనం..,,,వారాహి యాత్రకు లాంగ్ బ్రేక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 06:42 PM

ఆంద్రప్రదేశ్ ‌రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఓవైపు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీగా ఉండగా.. బయట టీడీపీ నేతలు నోరు జారుతూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక.. ఇదే సమయంలో వారాహి విజయ యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పటికే షార్ట్ బ్రేక్ ప్రకటించగా.. ఇప్పడు అది కాస్త లాంగ్ బ్రేక్ అయ్యింది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ ఫారిన్ టూర్‌కు వెళ్తున్నారు. అయితే.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో పవన్ ఫారిన్ టూర్ చేయటమేంటీ అనుకోకండి.. ఆయన సినిమా షూటింగ్‌ కోసం ఫారిన్ వెళ్లట్లేదు. తన ఫ్యామిలీలో జరుగనున్న పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు జనసేనాని.


అయితే త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా.. వీళ్ల పెళ్లి ఇటలీలో ఘనంగా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ ప్లాన్ చేసింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చాలా మంది ఇటలీ చేరుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయినట్టు సమాచారం. అయితే.. వరుణ్ తేజ్ పెళ్లికి హాజరయ్యేందుకు పవన్ ఇటలీకి పయనం కానున్న నేపథ్యంలోనే వారాహి విజయ యాత్రకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఇక్కడ పరిస్థితులు అన్ని చక్కబెట్టిన తర్వాతే పవన్ ఇటలీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.


అక్టోబర్ 1 నుంచి ప్రారంభించిన నాలుగో విడత వారాహి విజయ యాత్ర.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాలల్లో నిర్వహించారు. కాగా.. అక్టోబర్ 5 నుంచి యాత్రకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి జనసేన పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ లాంగ్ బ్రేక్ నేపథ్యంలో సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు జనసేన పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం 12 నుంచి 17 వరకు పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇలా వారానికి పైగా జనసేనాని పార్టీ కార్యక్రమల్లో బిజీబిజీగా గడపనున్నారు. ఈలోగా చంద్రబాబుకు బెయిల్ వస్తే.. ఆయనతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవనున్నారు.


మరోవైపు.. తెలంగాణ నేతలతోనూ పవన్ కళ్యాణ్ సమావేశం కానునట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. టికెట్ల కేటాయింపు.. బీజేపీతో పొత్తుతో పాటు.. టీడీపీతో పొత్తు లాంటి అంశాలపై నాయకులతో చర్చించే అవకాశం ఉంది. ఈనెల 17 వరకు పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపిన అనంతరం జనసేనాని ఇటలీకి పయమనవుతారు. అక్టోబర్ 17న పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేడుక ముగిసిన అనంతరం ఈ నెల 26న పవన్ కల్యాణ్ తిరిగి స్వదేశానికి రానున్నట్లు సమాచారం. మరోవైపు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి అనంతరం.. ఇండియాకు వచ్చిన తర్వాత డెహ్రాడూన్, హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa