ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫ్ఘనిస్తాన్‌లో 2 వేలు దాటిన భూకంప మృతులు,,,,400 ఇళ్లు నేల మట్టం

international |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 10:23 PM

భూకంపం ధాటికి ఆఫ్ఘనిస్తాన్‌ కకావికలం అయింది. రెండు దశాబ్దాల్లో ఇదే అతి పెద్ద భూకంపం అని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 2 వేల మందికిపైగా మృతి చెందారు. వేలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వందలాది ఇళ్లు పూర్తిగా నేల మట్టం అయ్యాయి. పూర్తిగా భూస్థాపితం అయ్యాయి. వందలాది మంది కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఆఫ్ఘనిస్తాన్ విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతులు, గాయపడిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.


ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉన్న హెరాత్ ప్రావిన్స్‌ పరిధిలో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడు సార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. రిక్టర్‌ స్కేలుపై 6.3 గా నమోదైన భూకంపమే అతి పెద్దదని పేర్కొంది. భూకంపం ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దాదాపు 400 కు పైగా ఇళ్లు నేలమట్టం అయ్యాయని.. వేలాది ఇళ్లు దెబ్బతిన్నట్లు చెప్పారు. భూకంపం ధాటికి కమ్యూనికేషన్‌ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తాలిబన్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.


హెరాత్ ప్రావిన్స్‌లో 19 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ హెరాత్ ప్రావిన్స్‌లో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణిలో ఇది యురేషియన్, భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంది. గతేడాది జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతో సంభవించిన భయంకరమైన భూకంపంలో దాదాపు వెయ్యి మంది చనిపోగా.. దాదాపు 10 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఈ ఏడాది మార్చిలో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 13 మంది చనిపోయారు.


మొత్తం ఐదు సార్లు భూమి కంపించినట్లు వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాలకు 5.6 తీవ్రతతో మొదటిసారి భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత మరో అరగంట వ్యవధిలోనే మరో 2 సార్లు భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 12 గంటల 11 నిమిషాలకు 6.1 తీవ్రతతో ఒకసారి.. ఆ తర్వాత 12 గంటల 42 నిమిషాలకు 6.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు తెలిపింది. ఇక ఈ భూకంపంలో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన 11 మంది కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుని సమాధి అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa