ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవనాన్ని ఢీకొని ఒకే రోజు 1000 పక్షులు మృతి,,,కుప్పలు కుప్పలుగా పడి ఉన్న పక్షులు

international |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 10:25 PM

కొన్ని పక్షులకు ఎంత ఎత్తుకైనా ఎగిరే సామర్థ్యం ఉంటుంది. పెద్ద పెద్ద భవనాల పైకి ఎక్కి అక్కడి నుంచి కిందికి ఎగురుతూ ఉంటాయి. ఇక మరికొన్ని పక్షులు వేల కిలోమీటర్ల దూరం ఒక దేశం నుంచి మరో దేశానికి సీజన్‌ను బట్టి వలస వెళ్తూ ఉంటాయి. అయితే సంచరిస్తూనే ఉండటం అనేది పక్షులకు ఉన్న సహజ లక్షణం. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన పక్షి ప్రేమికులకు గుండెలు పగిలినంత పనిచేసింది. ఎందుకంటే కుప్పలు కుప్పలుగా పక్షులు చనిపోయి ఒక దగ్గర పడి ఉన్నాయి. ఈ దృశ్యాలను చూసిన ప్రతీ ఒక్కరి హృదయం ద్రవింపజేస్తోంది.


అమెరికాలోని చికాగోలో భారీ సంఖ్యలో చనిపోయి ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఒకేరోజు వెయ్యి పక్షులు మృతి చెందడం సంచలనంగా మారింది. అయితే అవన్నీ ఓ భవనాన్ని ఢీకొనడం వల్ల చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే అవి శీతాకాలంలో వలస కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వింటర్‌లో వలస కోసం దక్షిణ అమెరికాకు వెళ్లి.. అక్కడి నుంచి ఉత్తర అమెరికాకు వస్తుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చికాగోలోని మెక్‌కార్మిక్ ప్రాంతంలో రెండున్నర కిలోమీటర్ల వ్యాసార్థంలో వందలాది పక్షులు మృతి చెంది కుప్పలు కుప్పలుగా పడిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


కుప్పలుగా పడిపోయి ఉన్న ఆ పక్షుల్లో కొన్నింటిన స్థానికులు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే ఆ పక్షులు చనిపోవడానికి కారణం తెలుసుకున్నారు. ఓ భవనాన్ని ఢీకొని కింద పడిపోవడ వల్లే కారణమని చికాగో బర్డ్ కొలిజన్ మానిటర్స్ డైరెక్టర్ అన్నెట్ ప్రిన్స్ వెల్లడించారు. వీటిలో కొన్ని చనిపోగా.. మరికొన్ని గాయపడిన పక్షులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఏటా శీతాకాలంలో దాదాపు 15 లక్షల పక్షులు వలస వెళ్తూ ఉంటాయి. ఇందులో టేనస్సీ వార్బ్లెర్స్, హెర్మిట్ థ్రష్‌లు, అమెరికన్ వుడ్‌కాక్స్, ఇతర రకాల సాంగ్‌ బర్డ్‌లు ఉంటాయి. కిటికీకి తగిలిన ప్రతి పక్షి చనిపోదని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియోలోని బ్రెండన్ శామ్యూల్స్ అనే శాస్త్రవేత్త తెలిపారు. పక్షుల మరణాలకు గాలి, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా కారణం కూడా కావచ్చని అంచనా వేశారు.


ఆ పక్షులు భవనానికి ఉన్న అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు, భయపడి కిందపడి చనిపోతున్నాయని వెల్లడించారు. అలా కింద పడినపుడు కొన్ని పక్షులు గాయపడతాయని పేర్కొన్నారు. భవనాల్లో లైట్లు ఆఫ్ చేయడం వల్ల పక్షుల మరణాలను తగ్గించవచ్చని తెలిపారు. చికాగోలో పక్షుల మరణాలపై 2021లో జరిపిన ఒక అధ్యయనంలో పెద్ద భవనాల్లో సగం లైట్లు ఆఫ్ చేయడం వల్ల పక్షుల ఢీకొనడం 6 నుంచి 11 రెట్లు తగ్గుతుందని తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa