ఏపీలో రేపు ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనున్నది. స్కిల్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తన క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇటీవల ఈ పిటిషన్ లో వాదనలు విన్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దాంతో, సుప్రీంకోర్టులో రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు, బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పైనా, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపైనా విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ లో ఉంచింది. రేపు సోమవారం ఈ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. ఇక, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు , అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో రేపు తీర్పు వెలువడనుంది. ఈ కేసుల్లో ఇటీవల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa