ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ఆటగాళ్ల ముందు జై శ్రీరాం నినాదాలు సరికావు.. ఉదయనిధి స్టాలిన్

national |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 08:12 PM

క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత్, పాక్ జట్లు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎప్పటిలాగే భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెటర్ల ముందు భారత అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేయడాన్ని తమిళనాడు క్రీడాశాఖ మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. పాకిస్థాన్ ఆటగాళ్ల సమక్షంలో ఇండియన్ ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. క్రీడలు దేశాన్ని ఐక్యం చేయడానికి ఉపయోగపడాలి కానీ.. ద్వేషాన్ని వ్యాప్తి చెందేలా ఉండకూడదని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్‌ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్.. అవుట్ అయి.. మైదానంలో నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో భారత అభిమానులు జై శ్రీరాం అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో ఆ వీడియోలపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. దానికి సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేసిన ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


అయితే పాకిస్థాన్ ఆటగాళ్ల పట్ల భారత అభిమానులు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో.. సోషల్ మీడియాలో భిన్నరకాల కామెంట్లు వస్తున్నాయి. ఫ్యాన్స్ తీరును ఖండిస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతుండగా.. వారిని సమర్థిస్తూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొంతమంది నెటిజన్లు.. ఉదయనిధి స్టాలిన్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇశ్తున్నారు. మరో పది రోజుల్లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం పాకిస్థాన్ ఆటగాళ్లు వస్తారని.. అప్పుడు వారిని గౌరవంగా స్వాగతించండి అని కామెంట్లు చేస్తున్నారు. చెన్నైలో ఉండే పిచ్‌ పాకిస్థాన్‌కు కలిసి వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలో పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది.


ఇక శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో భారత్ మట్టి కరిపించింది. ఇక ఈ మ్యాచ్‌లోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు భారత ప్లేయర్ విరాట్ కోహ్లీ తన సంతకం చేసిన జెర్సీని గిఫ్ట్‌గా అందించాడు. కొన్ని మ్యాచ్‌లలో క్రికెటర్లను ఉద్దేశించి అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. గతంలో భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌ సందర్భంగా మహ్మద్ షమీ బౌలింగ్ వేసే క్రమంలో అభిమానులు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేయడం అప్పట్లో తెగ సంచలనంగా మారింది. ఈ నినాదాలపై తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa