ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఠారీ వరుస హత్యల కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 08:15 PM

17 ఏళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో అలహాబాద్‌ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో దోషులుగా నిర్దారణ అయి.. మరణశిక్ష పడిన ఇద్దర్నీ నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాలు కారణంగానే నిందితులు సురేందర్‌ కోలీ, మానిందర్‌ సింగ్‌ పంధేర్‌‌లను నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో ఈ కేసుల్లో కింది కోర్టు విధించిన మరణశిక్ష రద్దయ్యింది. రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలోని నిఠారీ గ్రామంలో 2005 నుంచి 2006 మధ్య జరిగిన వరుస హత్యలు అప్పట్లో యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.


డిసెంబరు 2006లో స్థానిక వ్యాపారవేత్త మానిందర్‌ సింగ్‌ పంధేర్‌ ఇంటి సమీపంలోని ఓ మురికి కాల్వలో మానవ అవశేషాలు కొన్ని బయటపడ్డాయి. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. మానిందర్ పంధేర్‌ ఇంటి వెనుక భాగంలో చిన్నారులు, యువతుల అస్థిపంజరాలు బయటపడటంతో పోలీసులే షాకయ్యారు. ఇవన్నీ ఆ ప్రాంతంలో ఏడాదిగా కన్పించకుండా పోయిన పేద చిన్నారులు, యువతులవేనని పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు.


ఈ హత్యలపై సీబీఐ దర్యాప్తులో భయంకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పంధేర్‌ ఇంట్లో పనిచేసే సురేందర్‌ కోలీ.. స్వీట్లు, చాక్లెట్ల ఆశ చూపి చుట్టుపక్కల ఉన్న చిన్నారులను తీసుకొచ్చినట్టు గుర్తించారు. అనంతరం వారిపై పంధేర్, కోలీలు అత్యాచారం చేసి.. చంపేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆధారాలు దొరక్కుండా మృతదేహాలను ముక్కలుగా చేసి వాటి ఇంటి వెనుక భాగం, మురికి కాల్వల్లో విసిరేసినట్టు సీబీఐ ఆరోపించింది. వీరు నరమాంసభక్షకులనే ఆరోపణలు కూడా వెల్లువెత్తడంతో మొత్తం 19 కేసులు నమోదు చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా మూడింటిని ప్రాథమిక విచారణలో మూసివేశారు.


వరుస హత్యలపై విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు.. కొన్ని కేసుల్లో సురేందర్‌ కోలీని దోషిగా నిర్దారించి మరణశిక్ష విధించింది. మరోవైపు, పంధేర్‌ కొన్ని కేసుల్లో నిర్దోషిగా బయటపడగా.. రెండు కేసుల్లో అతడు దోషిగా తేలడంతో ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే, ఈ శిక్షలను సవాల్ చేస్తూ సురేంద్ర కోలీ, పంధేర్‌ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇటీవల విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.. సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో వీరిద్దరికీ వ్యతిరేకంగా సరైన సాక్ష్యాాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో ఈ కేసుల్లో వారి మరణశిక్ష రద్దయినట్లైంది.


ఇక, ఈ నిఠారీ ఘటనకు సంబంధించి మహిళ హత్యాచారం కేసులో సురేందర్‌ కోలీ మరణశిక్షను గతంలో అలహాబాద్‌ హైకోర్టు సమర్థించడం గమనార్హం. ఇంకో కేసులో అతడి ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. కానీ, సీబీఐ విచారణలో భయంకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులను చంపి మృతదేహాలపై లైంగిక దాడిచేయడమే కాదు.. శరీర భాగాలును కూడా తిన్నట్టు సురేంద్ర కోలీ సీబీఐ విచారణలో అంగీకరించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa