జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ హత్య కేసులో ఐదుగుర్ని న్యాయస్థానం దోషులుగా నిర్దారించింది. ఢిల్లీలోని వసంత్ విహార్లో 2008 సెప్టెంబరు 30 వ తేదీన 25 ఏళ్ల సౌమ్యా విశ్వనాథ్ దారుణ హత్యకు గురయ్యారు. తుపాకితో కాల్చి అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తలపై తీవ్ర గాయాలతో జర్నలిస్ట్ చనిపోయినట్టు ఫోరెన్సిక్, పోస్ట్మార్టం నివేదికలో వెల్లడయ్యింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్ కుమార్, అజయ్ సేథిలను దోషులుగా తేల్చింది. అంతేకాదు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టంలోని నిబంధనల ప్రకారం దోపిడి కేసులోనూ దోషులుగా పేర్కొంది. నలుగురు నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్లను హత్య, దోపిడీ కేసులో దోషులుగా నిర్దారించిన కోర్టు.. వీరికి సహకరించినందుకు ఐదో నిందితుడు అజయ్ను కూడా దోషిగా పరిగణించింది. ఈ కేసులో 2009 మార్చిలో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పదిహేనేళ్ల పాటు విచారణ సుదీర్ఘంగా సాగింది. విచారణను అక్టోబరు 13న పూర్తిచేసిన సాకేత్ కోర్టు అడిషినల్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే.. తీర్పును రిజర్వులో ఉంచారు.
డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఈ నెల ప్రారంభంలో తమ వాదనలను పూర్తి చేయడంతో అదనపు వాదనలు లేదా వివరణల కోసం నాలుగు రోజులు సమయం ఇచ్చారు. ఎటువంటి అభ్యర్థనలు రాకపోవడంతో తీర్పును బుధవారం వెలువరించారు. ఐటీ ఎగ్జిక్యూటివ్ జిగిషా ఘోష్ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతో విశ్వనాథన్ హత్య కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. విచారణ వేగవంతం చేయాలని కోరుతూ 2019లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో చార్జిషీట్ దాఖలు చేసిన తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత విచారణ ఎందుకు ముగియలేదని ట్రయల్ కోర్టును ఢిల్లీ హైకోర్టు నివేదిక కోరింది. ప్రాసిక్యూషన్ సాక్షులు హాజరుకాకపోవడం, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికి సమయం పట్టడం వంటి కారణాల వల్ల జాప్యం జరిగిందని ట్రయల్ కోర్టు హైకోర్టుకు నివేదించింది. ఆగస్టు 2016లో జిగిషా ఘోష్ హత్య కేసులో ట్రయల్ కోర్టు కపూర్, శుక్లాలకు మరణశిక్ష.. మాలిక్కు జీవిత ఖైదు విధించింది. అయితే, జనవరి 2018లో కపూర్, శుక్లాల మరణశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. మాలిక్ జీవిత ఖైదును సమర్థించింది.
కోర్టు తీర్పుపై స్పందించిన సౌమ్యా విశ్వనాథన్ తల్లి.. ఇది నేరాలకు నిరోధిస్తుందని అన్నారు. ‘మా కూతురు చనిపోయింది.. కానీ ఇది ఇతరులకు నిరోధకంగా పనిచేస్తుంది.. లేకుంటే మరింత రెచ్చిపోతారు.. ఒక్క వర్గం గ్యాంగు అయినా బయపడుతుంది’ అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చే వరకూ సౌమ్యా విశ్వనాథన్ మరణాన్ని రోడ్డు ప్రమాదంగానే భావించారు. అయితే, ఆమెది ప్రమాదం కాదని, హత్యని తేలింది. తలలో బుల్లెట్ గాయం ఉందని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ సౌమ్య విశ్వనాథన్ వాహనాన్ని మరో కారు ఢీకొట్టినట్టు బయటపెట్టింది. మరొక కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లాలను అరెస్టుతో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ జిగిషా హత్యతో దీనికి సారూప్యత ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చివరకు విచారణలో సౌమ్యా విశ్వనాథన్ను తామే హత్యచేసినట్టు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa