తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలనుకున్నా, ఆ పదవి నన్ను వదిలిపెట్టి వెళ్లడం లేదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలో ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టే రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి పార్టీ హైకమాండ్ తనకు మూడుసార్లు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. అయితే, హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్న గెహ్లాట్.. పరోక్షంగా యువనేత సచిన్ పైలట్కు చురకలంటించారు. సీఎం పదవి కోసం గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. మూడేళ్ల కిందట సచిన్ తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నడిపినా.. అధిష్ఠానం జోక్యంతో మెత్తబడ్డారు.
కాగా, తాను నాలుగోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఓ మహిళ అన్నారని, సీఎం పదవిని వదులుకోవాలని అనుకుంటున్నానని చెప్పాను కానీ ఈ పదవి నన్ను వదలడం లేదని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. నవంబరు 25న రాజస్థాన్లో పోలింగ్ జరగనుండగా.. గెహ్లాట్, సచిన్ వర్గాల ఐక్యంగా ఉంచడానికి హైకమాండ్ ప్రయత్నిస్తూనే ఉంది. అయినాసరే ఎప్పటికప్పుడు విబేధాలు బయటపడుతున్నాయి.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల జాప్యంపై అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ.. ప్రతిపక్ష బీజేపీ మాత్రమే దానిపై చింతిస్తున్నదని అన్నారు. ‘మేం పోట్లాడటం లేదు కాబట్టి వాళ్లు మనస్తాపానికి గురయ్యారు.. అందరి అభిప్రాయాలను పరిశీలించి అన్ని నిర్ణయాలూ తీసుకుంటున్నాం.. సచిన్ పైలట్ మద్దతుదారులతో కూడా మాట్లాడి వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నాను.. నిర్ణయాలు సజావుగా జరుగుతున్నాయి.. అందుకే బీజేపీకి మాత్రం సంతోషం లేదు’ అని రాజస్థాన్ సీఎం విమర్శించారు.
ఒకవేళ, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరిస్తే.. ప్రత్యామ్నాయంగా వారి కంటే బలమైన అభ్యర్థిని పార్టీ ఎంపిక చేస్తుందని చెప్పారు. అంతేకాదు, పైలట్ వర్గం నుంచి టికెట్ ఆశించేవారి అవకాశాలపై పార్టీలో ఎటువంటి చీలిక లేదని తాను క్షమించు, మరచిపో మంత్రాన్ని అనుసరిస్తున్నానని స్పష్టం చేశారు. అంతకు ముందు పైలట్ సైతం తమ పార్టీ తిరిగి రాజస్థాన్లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. అయితే, రెండు పార్టీలకు అంతర్గత కుమ్ములాట తలనొప్పిగా మారింది. ఇది ప్రతిపక్ష బీజేపీలో కొంచెం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా వసుంధర రాజే సింధియా, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. అయితే, రాజస్థాన్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. ఈసారి ఆ సంప్రదాయం కొనసాగుతుందా? కాంగ్రెస్ చరిత్రను తిరగరాస్తుందా? అనేది డిసెంబరు 3 తేలిపోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa