ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో,,,శ్రీసత్యసాయి జిల్లాలో ఆగిన రైళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 29, 2023, 08:33 PM

విద్యుత్ సరఫరా నిలిచిపోవడం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని ధర్మవరం - తిరుపతి రైల్వేలైన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో విద్యుత్తు ఇంజిన్లతో నడిచే రైళ్లు గంటల తరబడి ఆలస్యం అయ్యాయి. కాచిగూడ - మదురై ఎక్స్‌ప్రెస్‌ రైలు ముదిగుబ్బలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి.. ధర్మవరం - నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బత్తలపల్లి మండలం చిన్నేకుంటపల్లి రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం 2.45 గంటల నుంచి నిలిచిపోయాయి.


అయితే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించిన తర్వాత రాత్రి 8 గంటలకు మదురై ఎక్స్‌ప్రెస్‌.. ఆ తర్వాత 10:35 గంటలకు నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరి వెళ్లాయి. అయితే ఎలాంటి సౌకర్యాలు లేని స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో తాగునీరు, ఫుడ్ కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. విజయవాడ డివిజన్‌లో రైల్వే లైన్ల నిర్వహణ కారణంగా ఈనెల 30 నుంచి పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ఈ నెల 30 నుంచి నవంబరు 5వ తేదీ వరకు విజయవాడ-బిట్రగుంట రైలు అప్‌ అండ్‌ డౌన్‌ సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఈనెల 30 నుంచి నవంబరు 3వ తేదీ వరకు బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌ అప్‌ అండ్‌ డౌన్‌ సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఈనెల 30, 31, నవంబరు 1, 3, 4 తేదీలలో విజయవాడ-విశాఖపట్నం అప్‌ అండ్‌ డౌన్‌ సర్వీసులను రద్దు చేస్తున్నారు.


ఈనెల 30వ తేదీ నుంచి నవంబరు 5 వతేదీ వరకు మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-మచిలీపట్నం, నర్సాపూర్‌-విజయవాడ, విజయవాడ-మచిలీపట్నం రైళ్లను రామవరప్పాడు-విజయవాడ మధ్య రద్దు చేస్తున్నారు. మచిలీపట్నం-భీమవరం, విజయవాడ-నర్సాపురం రైళ్లను విజయవాడ-రామవరప్పాడు మధ్య రద్దు చేస్తారు. ఈనెల 30వ తేదీన ఎర్నాకుళం జంక్షన్‌-పాట్నా రైలును నవంబరు 4వ తేదీన భావ్‌నగర్‌-కాకినాడ పోర్ట్‌ రైలును, నవంబరు 1వ తేదీన, 3వ తేదీన బెంగళూరు- గౌహతి రైలును, ఈనెల 30వ తేదీ నవంబరు 1, 3, 4 తేదీలలో ఛత్రపతి శివాజీ టెర్మిన్‌స-భువనేశ్వర్‌ రైళ్లను విజయవాడ, గుడివాడ, భీమవరం టెర్మినల్‌, నిడదవోలుమీదుగా మళ్లిస్తారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa