ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో తెరుచుకున్న శ్రీవారి ఆలయం తలుపులు.. మళ్లీ దర్శనాలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 29, 2023, 08:28 PM

తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం తెల్లవారుజాము 3:15 గంటలకు టీటీడీ అధికారులు స్వామివారి ఆలయం తలుపులు తెరిచారు. పాక్షిక చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధిచేసి.. ఉద‌యం 6 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమతి ఇచ్చారు. శ్రీవారి ఆలయం దాదాపు 8 గంటల పాటూ మూతపడింది. శనివారం రాత్రి 7.05 గంటలలకు తలుపులు మూసిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తయ్యింది. మరోవైపు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని శ‌నివారం సాయంత్రం 6 గంటలకు మూసివేశారు.. ఆదివారం ఉదయం 9 గంటలకు తెరిచారు.


పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూతపడిన టీటీడీ స్థానికాల‌యాలు కూడా తిరిగి తెరుచుకున్నాయి. అక్టోబ‌రు 29న వేకువ‌జామున 1.05 నుంచి 2.22 గంట‌ల వ‌ర‌కు పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం కొనసాగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూసివేశారు. ఆదివారం తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. శుద్ధి అనంత‌రం ఉదయం 7 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమతించారు.


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల్లో శ‌నివారం రాత్రి 7 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూసివేశారు. ఆదివారం తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు.. శుద్ధి అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం 6.45 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూసి వేశారు. ఆదివారం ఉద‌యం 4 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచి శుద్ధి అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa